కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నిరసనలు చేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు నెలల పాటు దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలతో పాటు యూపీకి చెందిన కొందరు రైతులు కూడా సింఘు, ఘాజీపూర్‌, టిక్రీ సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు... ఈ క్రమంలో చాలా మంది రైతులు ప్రాణాలను కూడా విడిచారు.


అయితే, నేడు భారత్ బంద్ కోసం పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 12గంటల పాటు ఈ బంద్‌ కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు వెల్లడించారు. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్‌ చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ సైతం మూసివేయాలని కోరారు.


ఈ మేరకు బంద్ ను ఎక్కడా హింసాత్మకంగా మార్చకుండా కొనసాగించాలని కోరారు.బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు.సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చిన ఈ 12 గంటల బంద్‌కు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, తెదేపా, వైకాపా, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎస్‌కేఎం ఇచ్చిన బంద్‌ పిలుపునకు పలు రైతు సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు, బార్‌ అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు తమ బంద్‌కు మద్దతు ప్రకటించాయని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: