కొద్దిరోజులుగా ఏపీలో  ఒక్కో అడుగు ముందుకేస్తున్న బీఆర్ఎస్ ప్రచారం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా చోట్ల బీఆర్ఎస్ కు మద్దతుగా పెద్ద పెద్ద హోర్డింగులు కనిపించాయి. ఈ స్ధాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఏపీలో ప్రచారం జరుగుతుందని ఎవరు అనుకునుండరు. ఇంతకీ విషయం ఏమిటంటే సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతు కేసీయార్, తోట చంద్రశేఖర్ ఫొటోలున్న భారీ హోర్డింగులు చాలాచోట్ల ప్రముఖంగా కనిపించాయి.





ఉభయగోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు విజయవాడలో కూడా చాలా హోర్డింగులు వెలిశాయి. ఎక్కడికక్కడ స్ధానికంగా ఉన్న కొందరు హోర్డింగులను ఏర్పాటు చేసుకున్నట్లు అర్ధమవుతోంది. బహుశా వీటన్నింటినీ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే ఏర్పాటు చేయించుండచ్చు. కేసీయార్ కు మద్దతుగా బీఆర్ఎస్ కు స్వాగతం చెబుతు విజయవాడ, గుంటూరు, కడియం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, ముక్కామల, యానాంలో ఏర్పాటైన ఫ్లెక్సీలను జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.





మొత్తానికి బీఆర్ఎస్ మొదటి బహిరంగసభ నిర్వహించేలోగానే, విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఓపెన్ చేయకముందే పార్టీకి బాగా ప్రచారం జరిగేట్లుగా కేసీయార్ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.  ఆర్ధికంగా బాగా గట్టిస్ధితిలో ఉండి, కాపుల్లో కీలక వ్యక్తిగా ఉన్న తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవటంలోనే కేసీయార్ సక్సెస్ అయ్యారు. కేసీయార్ ఆలోచనలకు తగ్గట్లుగానే తోట కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు.






అలాగే బీఆర్ఎస్ లోకి వీలైనంతమందిని అందులోను కాపు ప్రముఖులను చేర్చుకోవటమే టార్గెట్ గా తోట పావులు కదుపుతున్నారు. తోట ఆలోచనలకు తగ్గట్లుగానే కేసీయార్ గనుక పార్టీలో చేరాలని అనుకున్నవారికి స్పష్టమైన హామీలిస్తే ఎక్కువమంది పార్టీలో చేరే అవకాశముంది. ఎలాగూ పార్టీతరపున పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు చాలామంది అవసరం. కాబట్టి ఇపుడు చేర్చుకునే వాళ్ళల్లో వచ్చేఎన్నికల్లో పోటీకి కూడా పనికొచ్చేవారిని చేర్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయని తోట ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగానే నేతలను ఆకర్షించటంలో భాగంగానే ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: