టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఆయన నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని రావడంతో గౌతమ్ గంభీర్ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ మేరకు తన సన్నిహితులు, తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


గౌతమ్ గంభీర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తనకు పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల నాకు కరోనా స్పల్వ లక్షణాలు బయట పడ్డాయి. దీంతో నేను కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్నాను. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు నేను స్వీయ నిర్బంధం చేసుకున్నాను. నన్ను కలిసిన వాళ్లు.. నా సన్నిహితులు కరోనా టెస్టులు చేసుకోండి.’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండి.. సేఫ్ ఉండాలని ఆయన తెలిపారు.


కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కరోనా కేసులు భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసుల్లో తగ్గుముఖం ఉన్నా.. ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని.. బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పేర్కొంది. వ్యాక్సిన్ వేసుకోని వారు విధిగా టీకాలు వేయించుకోవాలని సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: