దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండగా రెండు స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నారా..! అని ఆశ్చర్యపోకండి. ఈ స్పెషల్ రైళ్లు ప్రయాణికుల కోసం కాదు. శుక్ర, శనివారాల్లో( ఈనెల 17, 18వ తేదీలు) నడువనున్న ఈ రెండు ప్రత్యేక రైళ్లలో సరిహద్దులకు సైనికులను చేరవేయనున్నారు. దేశ ఉత్తర, తూర్పు సరిహద్దుల రక్షణ అవసరాల నిమిత్తం ఈ మిలిటరీ స్పెషల్ రైళ్లకు కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. 17న బయలుదేరే మొదటిరైలు బెంగళూరు - బెల్గాం - సికింద్రాబాద్ - అంబాలా - జమ్ము మార్గంలో, రెండో రైలు బెంగళూరు - బెల్గాం- సికింద్రాబాద్ - గోపాల్పూర్ - హౌరా - న్యూజల్పాయ్గుడి - గువాహటి మార్గంలో ప్రయాణిస్తాయని సీనియర్ అధికారి వెల్లడించారు.
బెంగళూరు, బెల్గాం, సికింద్రాబాద్, గోపాల్పూర్లలోని సైనిక సిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులను ఈ రైళ్ల ద్వారా వారికి కేటాయించిన ప్రాంతాలకు చేరుస్తారు. ఈ చర్య ద్వారా సరిహద్దు భద్రత బలోపేతం కావడమే కాకుండా ఆయా శిక్షణ కేంద్రాల్లో రద్దీ కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మంరిన్ని రైళ్లు నడుపుతారని తెలుస్తున్నది.