జనసేన అధినేత పవన్ కొత్త రాగం.. సరికొత్త తాళం అందుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఎందుకని అనుకుంటున్నారా..? అదేనండీ.. కరోనా వైరస్ కట్టడికి ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలు గొప్పఫలితాన్ని ఇస్తున్నాయని పవన్ చెప్పుకొచ్చారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను పెంచాయని ఆయన అంటున్నారు. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు వెంటనే అప్రమత్తమైన మోడీ లాక్డౌన్ విధించి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే.. ఇక్కడే పవన్ చిన్న మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తున్నా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ నియంత్రణలో విఫలం చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం వహిస్తున్న వారి మాటలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయని కూడా పవన్ చెప్పుకొచ్చారు. ఈ రోజు బీజేపీ, జనసేన కీలక నేతలు వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి,నియంత్రణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఓ ప్రకటనను ట్విట్టర్లో విడుదల చేసింది. ఇందులో పవన్ తనదైన శైలిలో ప్రధాని మోడీ భజన అందుకున్నారు. మనదేశంలో మాత్రమే అత్యధికంగా ఉత్పత్తి అయ్యే మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ను అడిగిన దేశాలకు అందించి, దాతృత్వం చాటడంతో మనదేశాన్ని కొనియాడని దేశం లేదంటే అతిశయోక్తికాదని పవన్ ఆ ఆ ప్రకటనలో ప్రశంసలు కురిపించారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమంటూ కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఇక్కడే పలువురు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంలోనే అత్యధిక వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్న విషయాన్ని పవన్ ఎలా మరిచిపోయారని ప్రశ్నిస్తున్నారు. ఇది కాదా ఏపీ గొప్పదనం అని అడుగుతున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిర్ణయాలు దేశ ప్రతిష్టను పెంచాయి pic.twitter.com/1raGCxntgd
— janasena party (@JanaSenaParty) May 5, 2020