ఏ దుర్మూహూర్తంంలో దేశంలో కరోనా వైరస్ మొదలైందో కానీ.. మనుషులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా తిప్పలు తప్పడం లేదు. ఇక మార్చి నుంచి లాక్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి లాక్ డౌన్ ఎఫెక్ట్ పేద ప్రజల పై పడింది. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ఆకలితో అలమటించారు.. తమ స్వస్థలాలకు రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ మద్య కేంద్రం వలస కూలీలకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పరిమిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అర్ధరాత్రి వేళ స్వయంగా వంటిచేసి వలస కూలీల ఆకలి తీర్చారు. మూడు రోజులుగా ఆకలితో నడుస్తూ నీరసించిపోయిన 11 మంది మహిళా వలస కార్మికులకు ఆమె తన చేత్తో వండిపెట్టారు. ఓ మహిళ తనతోపాటు మరో పది మంది మహిళలు ఆకలితో అలమటిస్తున్నామని చెప్పింది. వెంటనే స్పందించిన ఎస్పీ తన సహాయకురాలితో కలిసి వంట చేశారు.
అర్ధరాత్రి 1.00 గంటలకు వలస కూలీలు ఉన్నచోటికి ఆమె స్వయంగా ఆహారం, మంచి నీళ్లు తీసుకెళ్లారు. మూడు రోజుల కిందట నెల్లూరు జిల్లా సూళ్లురుపేట నుంచి తాము బయలుదేరామని, దారిలో ఎలాంటి ఆహారం దొరకలేదని, కొనుక్కోడానికి డబ్బుల్లేవని వాళ్ళు ఎస్పీకి తమ బాధను వెలిబుచ్చారు. ప్రస్తుతం ప్రజలు కరోనాతో కష్టాలు పడుతున్నారు.. వారికి చేతనైనంత సహాయం చేయాలని అన్నారు.