తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వినియోగదారులకు శుభవార్త చెప్పారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. మార్చి, ఏప్రిల్, మే మాసాలకు జారీచేసిన బిల్లు మొత్తాన్ని 30%, 40%, 30% చొప్పున మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో జారీ అయ్యే బిల్లులతో పాటు వీటిని కలిపి కట్టాలని చెప్పారు.
విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు వాయిదాల వెసులుబాటు వర్తించదని అన్నారు. మీటర్ రీడింగ్, టారిఫ్, శ్లాబుల ప్రకారం బిల్లులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. విద్యుత్ బిల్లులు మాఫీచేసే యోచన ఏమీ లేదని మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.