ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరుగుతోందని, అయితే ఇది దీర్ఘకాలిక పెరుగుదల కాదని ఆయన బాంబు పేల్చారు. బిట్కాయిన్ విలువ పెరుగుదలను ఓ బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణగా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి. గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ ఇప్పుడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది.
వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే. అయినా కానీ బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు. అందుకే బిట్ కాయిన్పై నానాటికీ ఆసక్తి పెరిగిపోతోంది. అయితే ఈ వైఖరి బుడగ లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా అకస్మాత్తుగా పగిలిపోతుంది’ అంటూ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం గురించి, భారతీయ ప్రజల ఆర్థిక స్థితిని గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కార్ల తయారీ రంగంటో టెస్లా దూసుకుపోతోందని, టొయోటా, జనరల్ మోటార్స్ వంటి కంపెనీలకు టెస్లా గట్టి పోటీ ఇస్తుందని ఆయనన్నారు. ఇక గతేడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బ తిందని, అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ఆయన్నారు.