గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలను అష్ట కష్టాలు పెడుతోంది. కంటికి కనిపించని ఈ కరోనా దెబ్బకు ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ మహమ్మారి ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక వణికిపోతున్నారు. ఇక రోజులు తరబడి లాక్డౌన్ విధించినా.. కరోనా మాత్రం అదుపులోకి రావడం లేదు. వ్యాక్సిన్ వస్తేగాని కరోనా కట్టడి కాదని తేలడంతో.. ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు పగలు, రాత్రి అని తేడా లేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే ఓ వ్యక్తి ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని క్యాష్ చేసుకోవాలని చూశాడు. రూ.50 వేలు ఇస్తే.. తన మంత్రాలు, శక్తులతో కరోనాను మాయం చేస్తానని ప్రజలను నమ్మించి.. డబ్బులను దండుకుంటున్నాడు. చివరకు అడ్డంగా దొరికిపోవడంతో.. ఊసలు లెక్కేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ బాబా స్థానికంగా మంత్రాలతో రోగాలు నయం చేయడం.. దుష్టశక్తులను తరిమికొడతాడంటూ అక్కడి వారు నమ్ముతారు. ఇక ప్రస్తుతం ప్రజల్లో కరోనా భయం ఎక్కువయిపోవడంతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు ఈ ఇస్మాయిల్ బాబా.
కరోనాను నయం చేస్తానంటూ తన శిష్యులతో ప్రచారం చేయించుకుని.. తన దగ్గరకు వచ్చిన వారి చేతిలో నిమ్మకాయాలు చేతిలో పెట్టి, నుదుటికింత విభూతి పూసి, కరోనా పోయింది.. పో అంటూ పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కో కరోనా బాధితుడి నుంచి రూ.40వేల నుంచి 50వేలు వసూలు చేసేవాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలవగా.. దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు దొంగ బాబా బండారం బయటపడింది. అంతేకాదు, దాదాపు 70 మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు దొంగ బాబాను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు కనిపిస్తే హాస్పటల్కు వెళ్లండి. కానీ, ఇలాంటి దొండ బాబాలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి