పోలీసుల వివరాల ప్రకారం.. వేలూర్ తోటపాళ్యంకు చెందిన దినేష్ టైల్స్ అంటించే పని చేస్తున్నాడు. వేలూర్ సలవన్పేటకు చెందిన జీవితతో (23) ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి అక్షయ (5), నందకుమార్ (4), 6 నెలల ఓ పాప కూడా ఉంది. సలవన్పేట కచ్చేరి వీధిలో అద్దె ఇంట్లో ఉంటుంది ఆ కుటుంబం. దినేష్ నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో.. భార్యా-భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భార్యను చిత్రహింసలు పెట్టేవాడు దినేశ్.
ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం భర్తతో గొడవ జరగడంతో.. తిరుప్పూరు కుమరన్ 2వ వీధిలో ఉన్న తన పుట్టింటికి ముగ్గురు పిల్లలను తీసుకువెళ్లింది ఆమె. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తమ ఇంటికి వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. జీవిత తల్లి సాయంత్రం 5 గంటలకు ఆమెకు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు.. అనుమానంతో తన కుమారుడు జగదీశ్వరన్కు ఫోన్ చేసి వెళ్లి చూసి రావాలని కోరింది యువతి తల్లి. అతను జీవిత ఇంటికి వెళ్లి చూడగా తలుపులు గడియ పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి ఇంటి లోపలి గడియను తీసి లోపలికి వెళ్లాడు. అక్కడ ముగ్గురు పిల్లలు, సోదరి విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపి జీవిత కూడా ఉరేసేుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన దినేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.