సరిహద్దు దేశం బుసలు కొడుతోంది.. కవ్విస్తోంది.. కయ్యానికి కాలు దువ్వుతోంది.. రకరకాలుగా భారత్ ను రెచ్చగొడుతోంది.. ఈ నేపథ్యంలో సరిహద్దులు గర్జిస్తున్నాయ్.. పాకిస్తాన్ కవ్వింపు చేష్టలతో సరిహద్దులు వేడెక్కాయ్..పాక్ చేష్టలకు మరే దేశమైనా అయితే ఈ పాటికి యుద్ధమే వచ్చేదేమో... కానీ భారత్ మాత్రం ఇంతకాలం శాంతి మంత్రం పఠించింది. ఇప్పుడు పరిస్థితి దాటిపోయింది.
ఓపిక నశించింది. సహనం చచ్చింది. ఇంకా ఆగితే కాశ్మీర్లో మారణకాండకు మరెంతో మంది భారతీయులు బలైపోతారు. ఇక సమరశంఖం పూరించాల్సిందే.. అంటూ పాకిస్తాన్పై యుద్ధం విషయంలో ప్రతి భారతీయుడు అంటున్న మాటలు ఇవీ. అలాంటి సందర్భాల్ని స్వయంగా పాకిస్తాన్ కల్పించింది. యుద్ధం చివరికి వినాశనాన్నే మిగుల్చుతుంది. ఇందులో ఇంకోమాటకు తావులేదు. అయినాసరే, రోజూ చచ్చేకంటే, తాడోపేడో తేల్చుకోవడమే బెటర్.. అన్న అభిప్రాయం మెజార్టీ భారతీయుల్లో వ్యక్తమవుతోంది.

అంతర్జాతీయంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా అపఖ్యాతి పాలవుతున్న పాకిస్తాన్ తన దేశంలోని తీవ్రవాదులను కట్టడి చేయలేని బలహీన స్థితిలో పడిపోయింది. తనకు తాను అల్లుకున్న మతం ముసుగులోని తీవ్రవాద విషవలయం నుంచి ఊరట పొందడానికి, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి మన దేశంపై విరుచుకుపడుతూనే వుంది.
భారత్ తమపై యుద్ధం చేస్తే దీటుగా బదులిస్తామని ఇప్పటికే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. భారత్ ఏ క్షణంలోనైనా విరుచుకుపడే అవకాశముందని భావించిన పాక్.. సరిహద్దుకు యుద్ధ ట్యాంకులను తరలిస్తోంది. బుధవారం పాక్ ఆర్మీకి చెందు యుద్ధ ట్యాంకులు పదుల సంఖ్యలో సరిహద్దుకు చేరుకున్నాయి. భారత్ ఆర్మీ చర్యలకు దీటుగా స్పందించాలని ఆర్మీకి సర్వాధికారాలూ అప్పగించాడు ఇమ్రాన్ ఖాన్. జాతీయ భద్రతా కమిటీ భేటీ తర్వాత ఈమేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకు ఒకరోజు ముందే యుద్ధట్యాంకులను సరిహద్దుకు చేరవేశారు. దీంతో భారత్తో యుద్ధానికి పాక్ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ యుద్ధమనేది జరిగితే.. ఎవరి సత్తా ఏంతో అనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ఆర్థికంగా, జనాభా పరంగా రెండు దేశాలు ఏ స్థాయిలో వున్నాయో కూడా పరిగణనలోకి తీస్కున్నారు. ఆర్థికపరంగా భారత్ ముందుంది. కానీ పాకిస్థాన్ ఆర్థిక విలువ 30వేల 700 కోట్ల డాలర్లు మాత్రమే. మరి భారత్ ఆర్థిక వ్యవస్థ దాదాపు 2 లక్షల 79వేల కోట్ల డాలర్లు.
ఇండియా జనాభా 120 కోట్లు, ఇక పాకిస్తాన్ జనాభా 20 కోట్లు మాత్రమే. భారత్ తన మిలిటరీ కోసం గత బడ్జెట్లో సుమారు 5800 కోట్ల డాలర్లు కేటాయించింది. ఇక ప్రపంచ దేశాల్లో మిలిటరీ పరంగా భారత్ అయిదవ స్థానంలో వుంది. ఇక పాకిస్థాన్ తన మిలిటరీ బడ్జెట్ కోసం 1100 కోట్ల డాలర్లు పెట్టింది. పాకిస్తాన్ సైన్యంలో సుమారు 11 లక్షల సైనికులున్నారు. ఇక భారత ఆర్మీలో 33 లక్షల మంది సైనికులు వున్నారు. భారత్ వద్ద యుద్ధ ట్యాంక్లు సుమారు 3500 ఉన్నాయి. ఇది పాకిస్థాన్ కంటే సుమారు వెయ్యి ఎక్కువ. రష్యా తయారు చేసిన టీ-90 యుద్ద ట్యాంకులే భారత్ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
ఇక పాకిస్థాన్ వద్ద మాత్రం ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలు వున్నాయి. అలాగే భారత్ దాదాపు పదివేల కేంద్రాల నుంచి ఆర్మీ యూనిట్లను నిర్వహిస్తోంది. కానీ పాకిస్థాన్లో మాత్రం కేవలం ఐదువేల యూనిట్లలో మాత్రమే ఈ పని జరుగుతోంది. ఇక భారత్ వద్ద సుమారు 3100 ఇన్ఫాంటరీ యుద్ధ వాహనాలుంటే.. పాక్ వద్ద 425 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిల్లో ఫ్రాన్స్, అమెరికా, చైనా దేశాలకు చెందిన జెట్స్ ఉన్నాయి. ఇండియా వద్ద సుమారు 800 యుద్ధ విమానాలు ఉన్నాయి.
కానీ వాటిల్లో ఎక్కువ శాతం రష్యా వాడిన విమానాలే. ఈ జాబితాలో మిగ్ 21, మిగ్ 27 యుద్ధ విమానాలు ఉన్నాయి. భారత్ వద్ద బలమైన సుఖోయ్ 30 విమానాలు కూడా ఉన్నాయి. అయితే భారత వైమానిక దళం వద్ద కనీసం 200 సుఖోయ్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక నేవీలో మాత్రం భారత్ చాలా మెరుగ్గా ఉంది. కానీ కాశ్మీర్ గురించి జరుగుతున్న యుద్ధం కావడంతో.. నేవీ వుపయోగం వుండకపోవచ్చు.

ఇందులో అత్యంత ప్రమాదకరమైన అంశాల్లో అణ్వాయుధం ఒకటి. ఈ విషయంలో మాత్రం పాకిస్థాన్ ముందుందని తెలుస్తోంది. రెండు దేశాలూ 1990వ దశకంలోనే న్యూక్లియర్ బాంబులను పరీక్షించాయి. అయితే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీచర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. పాకిస్థాన్ వద్ద సుమారు 140 నుంచి 150 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్ వద్ద మాత్రం 130 నుంచి 140 వరకే న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నట్లు సమాచారం. కానీ అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా మాత్రం భారత్కే ఎక్కువగా ఉన్నది. భారత్ వద్ద మూడు అగ్ని రాకెట్లున్నాయి. ఈ రాకెట్లు కనీసం 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను షూట్ చేయగలవు. ఇక పాక్ దగ్గర ఉన్న షెహీన్ రాకెట్ మాత్రం కేవలం 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను మాత్రమే ధ్వంసం చేయగలదు.
యుద్ధ ప్రాతిపదిక అంశాల్లో భారత్ ముందున్నప్పటికీ.. ఒకవేళ అదే అనివార్యమైతే.. రెండు దేశాలకు ప్రాణనష్టమే ఒకవేళ అదే అనివార్యమైతే .. రెండు దేశాలకు ప్రాణనష్టమే మిగులుతుంది.
పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించిన మరునాడే పాక్ ప్రతీకారానికి కాలు దువ్వుతుండడంతో.. తాజా పరిస్థితులు దాయాది దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావచ్చంటూ పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.