అవినీతి రహిత పాలన అందిస్తామని, రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని మే 30న నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు 2019 ఆగస్టు–అక్టోబరులో జరిగిన నియామక ప్రక్రియలో ఒక్కో పోస్టుకు 17 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

 

అలాగే 2020 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా మొదటి విడత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయడంతో కొత్తగా ఈ పోస్టులవైపు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్ర‌మంలోనే ఒక్కో పోస్టుకు ఏకంగా 67 మంది పోటీ పడుతుండడం గమనార్హం. ఇప్పుడు 16,208 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా, 10.96 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2019 జూలైలో 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే పోటీ నాలుగు రెట్లు పెరిగింది. 

 

అలాగే 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ ఏడాది జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 10,96,740 మంది అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. గ్రేడ్‌–4 పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులతో కూడిన కేటగిరీ–1లో మొత్తం 1,025 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, 4,53,531 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా రాత పరీక్షలను యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తుండడంతో యువతలో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: