మంగళవారం మరో 21 మందికి వైరస్ నిర్ధారణ కాగా వీరంతా సెర్జియాంట్ ఆల్డీ అనే నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నౌక సాయంతో సైనిక స్థావరాలలోని సైనికులకు అవసరమైన సరకులను రవాణా చేస్తుంటారు. ఓ లెఫ్టినెంట్ స్థాయి అధికారి ఇంట్లో పనిచేసే సామాన్య పౌరుడికీ పాజిటివ్గా తేలింది. దీంతో అంటార్కిటికాలో తమ దేశానికి చెందిన మొత్తం 58 మందికి వైరస్ సోకినట్లు చిలీ సైన్యం ప్రకటించింది. బెర్నార్డ్ ఓ హిగ్గిన్స్ బేస్లో కనీసం 36 మందికి వైరస్ సోకిందని పేర్కొంది. వీరిని ఐసోలేషన్లో ఉంచి, ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు ఆర్మీ తెలిపింది. కోవిడ్ సోకినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించింది.
డిసెంబరు మధ్యలో తొలిసారి ఇద్దరు సైనికులు అనారోగ్యానికి గురయ్యారని ఆర్మీ అధికారి తెలిపారు. ఇక అంటార్కిటికాలో తమ దేశ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తున్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అమెరికా ప్రకటించింది. కరోనా బారిన పడ్డ చిలీ సైనికులతో అమెరికా సిబ్బంది కాంటాక్ట్లో లేరని స్పష్టం చేసింది. ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన అంటార్కిటికాలోని పరిశోధన, సైనిక కేంద్రాలకు వైరస్ చేరకుండా అన్ని దేశాలూ చర్యలు తీసుకున్నాయి. పర్యాటకులను నిషేధించి, సిబ్బంది కార్యకలాపాలను తగ్గించడం లాంటి చర్యలను చేపట్టాయి. అత్యంత శీతలంగా ఉండే అంటార్కిటికా ఖండంలోని 38 స్టేషన్లలో సుమారు 1,000 మంది సురక్షితంగా ఉన్నట్టు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పరిశోధకులు అంచనా వేశారు. కానీ ఈ వేసవి కాలం పూర్తయిన తర్వాత కరోనా వ్యాప్తి ముప్పు పెరిగింది.