గత ఏడాది ఇదే సమయానికి చైనా దేశంలో వుహాన్ నగరంలో నావెల్ కరోనా వైరస్ అనే మహమ్మారి విలయ తాండవం మొదలెట్టింది. సరిగ్గా ఏడాది పూర్తి అయ్యే నాటికి పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాదం మోపని ప్రాంతం ఏదైనా ఉందా అంటే అందరూ ఠక్కున చెప్పే పేరు అంటార్కిటికా. కానీ ఇకపై ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. మహమ్మారి చివరికి ఈ ఖండంపై కూడా పాదం మోపింది. దీంతో భూగోళంలోని ప్రతి ఖండానికీ కరోనా వైరస్‌ వ్యాపించినట్టయ్యింది. అంటార్కిటికాలోని చిలీకి చెందిన రెండు స్థావరాల్లోని సైనికులకు వైరస్‌ నిర్ధారణ అయ్యింది. సైనిక స్థావరాల్లోని 36 మంది వైరస్ బారినపడినట్టు సోమవారం నిర్ధారణ అయ్యింది. వీరిలో వీరిలో 10 మంది అక్కడి అధికారుల ఇళ్లలో విధులు నిర్వర్తిస్తున్న సాధారణ పౌరులు.


మంగళవారం మరో 21 మందికి వైరస్ నిర్ధారణ కాగా వీరంతా సెర్జియాంట్‌ ఆల్డీ అనే నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నౌక సాయంతో సైనిక స్థావరాలలోని సైనికులకు అవసరమైన సరకులను రవాణా చేస్తుంటారు. ఓ లెఫ్టినెంట్‌ స్థాయి అధికారి ఇంట్లో పనిచేసే సామాన్య పౌరుడికీ పాజిటివ్‌గా తేలింది. దీంతో అంటార్కిటికాలో తమ దేశానికి చెందిన మొత్తం 58 మందికి వైరస్‌ సోకినట్లు చిలీ సైన్యం ప్రకటించింది. బెర్నార్డ్ ఓ హిగ్గిన్స్ బేస్‌లో కనీసం 36 మందికి వైరస్ సోకిందని పేర్కొంది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచి, ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు ఆర్మీ తెలిపింది. కోవిడ్ సోకినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించింది.


డిసెంబరు మధ్యలో తొలిసారి ఇద్దరు సైనికులు అనారోగ్యానికి గురయ్యారని ఆర్మీ అధికారి తెలిపారు. ఇక అంటార్కిటికాలో తమ దేశ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తున్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అమెరికా ప్రకటించింది. కరోనా బారిన పడ్డ చిలీ సైనికులతో అమెరికా సిబ్బంది కాంటాక్ట్‌లో లేరని స్పష్టం చేసింది. ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన అంటార్కిటికాలోని పరిశోధన, సైనిక కేంద్రాలకు వైరస్ చేరకుండా అన్ని దేశాలూ చర్యలు తీసుకున్నాయి. పర్యాటకులను నిషేధించి, సిబ్బంది కార్యకలాపాలను తగ్గించడం లాంటి చర్యలను చేపట్టాయి. అత్యంత శీతలంగా ఉండే అంటార్కిటికా ఖండంలోని 38 స్టేషన్లలో సుమారు 1,000 మంది సురక్షితంగా ఉన్నట్టు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పరిశోధకులు అంచనా వేశారు. కానీ ఈ వేసవి కాలం పూర్తయిన తర్వాత కరోనా వ్యాప్తి ముప్పు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: