నెయ్యి అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పాల మీగడను చిలికించగా వచ్చే వెన్నను వేడి చేస్తే వచ్చేదే నెయ్యి. మరియు చాలామందికి నేయ్యి లేనిదే భోజనం చేయడానికి ఇష్టపడరు. ఇది మంచి అలవాటే. కానీ, కొందరు మాత్రం బరువు పెరిగిపోతామన్న భయంతో నెయ్యికి దూరంగా ఉంటారు. ఆరోగ్యానికి నెయ్యి మంచిదని తెలిసినా నెయ్యి తినడానికి దూరంగా ఉంటారు. అలాంటివారు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజానికి మంచి ఆరోగ్యాన్ని అందించే నెయ్యిని మితంగా తీసుకుంటే బరువు పెరగడం కాదు.. తగ్గిస్తుంది.
అలాగే తరచూ ఒక మోతాదులో నెయ్యి తీసుకుంటే మెదడులోని నాడీ వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కంటి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేటి కాలంలో చాలా మందే ఉంటున్నారు. అలాంటి వారు నెయ్యిని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో విటమిన్ ఎ పుష్కలంగా లభించి తద్వారా కంటి సమస్యలు తగ్గుతాయి.
అదేవిధంగా, ఉదయాన్నే టీ, కాఫీలకు బదులు రెండు చెంచాల నెయ్యి తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సులువుగా జీర్ణం కావడానికి అవసరమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది నెయ్యి. శరీరంలో జీర్ణవ్యవస్థ చురుగ్గా సాగితే సగం సమస్యలు తొలగుతాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రతి రోజు తగిన మోతాదులో నెయ్యి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.