ఇప్పటి వరకూ కరోనా లక్షణాలు లేకపోతే తమకేం కాదనే ధీమాలో చాలామంది ఉన్నారు. లక్షణాలు లేకుండానే కరోనా ఇలా వచ్చి అలా తగ్గిపోతుందని, ఇలాంటి వారి వల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించదనే తప్పుడు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా జరిగిన ఓ పరిశోధనలో కరోనా లక్షణాలు లేకపోతేనే ఎక్కువ ప్రమాదం అని తెలుస్తోంది. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారి కంటే...ఏ లక్షణాలు లేని అసింప్టమేటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ సర్వేలో స్పష్టమైంది. ఈ సంస్థ కరోనాబారిన పడిన 210 మంది డేటాను సేకరించి, విశ్లేషించగా ఈ విషయం స్పష్టమైంది.
వైరస్‌ లోడ్ తోపాటు, అదేస్థాయిలో ఇమ్యునిటీ లెవల్స్‌ ఉండటం వల్లే వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరి నుంచి ఇమ్యూనిటీ లెవల్స్‌ తక్కువగా ఉన్న వారికి వైరస్‌ వ్యాపించి, వారు మృత్యువాత పడుతున్నారని గుర్తించింది. హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 57 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కేవలం 30 శాతం మందిలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పించాయి. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే...ఏ లక్షణాలు లేని అసింప్టమాటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ లోడు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.

హైదరాబాద్ నగరంలోని కోవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లోని జీనోమ్‌ సీక్వెన్స్‌ డేటాను పరీక్షించారు శాస్త్రవేత్తలు. వైరస్‌ జీనోమ్‌లో ఎక్కువగా మార్పులు జరిగినట్లు గుర్తించారు. 95 శాతం మందిలో 20 బిక్లేడ్‌ అనే స్ట్రెయిన్‌కు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. కేవలం 5 శాతం మందిలో మాత్రమే ఇతర స్ట్రెయిన్‌లకు చెందిన వైరస్‌ ఉన్నట్లు తేలింది. మొదట్లో రెండు మూడు రకాల వైరస్‌ నిర్ధారణ అయినప్పటికీ.. మే జూన్ నెలల్లో ఈ బిక్లేడ్ స్ట్రెయిన్ కు చెందిన వైరస్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తమ్మీద ఈ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే.. కొవిడ్ వైరస్ సోకినవారిలో జ్వరం, దగ్గు.. ఇతర లక్షణాలుంటేనే వారిలో వైరస్ లోడ్ తక్కువగా ఉంటుంది. లక్షణాలు లేకుండా ఉండటం వల్ల చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారిలో వైరస్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటోంది. లక్షణాలు లేకుండా కొవిడ్ బారిన పడినవారిలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఈ పరిశోధన తేల్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: