మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మలయాళంలో భారీ హిట్ సాధించి, తెలుగులో కూడా మంచి మార్కులు వేయించుకున్న ‘లూసిఫర్’ రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్నారని తెలిసిందే. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరు? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తాడని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా పూర్తయిన తర్వాత సుజీత్ తప్పుకున్నాడట.

ఆ తర్వాత చిరంజీవితో మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న వినాయక్ పేరు తెరపైకి వచ్చింది. అదికూడా కాదని ఆ  తర్వాత రీమేక్ సినిమాలకు కమర్షియల్ హంగులు అద్దడంలో ట్యాలెంట్ ఉన్న హరీష్ శంకర్సినిమా చేస్తున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో డైరెక్టర్ పేరు వినబడుతోంది. అతనే మోహన్ రాజా. ఈయన కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. రామ్ చరణ్‌కు మంచి హిట్‌గా నిలిచిన ‘ధ్రువ’ మాతృక ‘తని ఒరువన్’కు డైరెక్టర్ మోహన్ రాజానే. కొన్ని రోజులుగా మోహన్ రాజా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆయన లూసిఫర్ స్క్రిప్ట్ వర్క్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, ఆయన డైరెక్ట్ చేయబోయేది చిరంజీవిని అని టాక్.

ఇప్పుడు ఈయనే చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో చిరునే చెప్పాలి. లూసిఫర్ రీమేక్ విషయం ఆయనే చెప్పారు. అలానే ఈ రీమేక్ డైరెక్ట్ చేసేది ఎవరనే విషయం కూడా ఆయనే రివీల్ చేయాలి. అప్పటి వరకూ మనకు ఈ సస్పెన్స్ తప్పదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిన షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. దీని తర్వాతే లూసిఫర్ రీమేక్‌పై ఓ క్లారిటీ వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: