మలయాళం హిట్ మూవీ "అయ్యప్పనుమ్ కోషియం" తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో "భీమ్లా నాయక్" టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. అందులో జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్... పృథ్వీరాజ్, బిజు మీనన్ పాత్రల్లో నటించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ క్రేజీ రీమేక్ నుంచి అభిషేక్ బచ్చన్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే దర్శకుడు జగన్ శక్తి ఈ మూవీకి సంబంధించిన అన్ని పనులు మొదలు పెట్టేసారు. నవంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రాజెక్ట్ నుంచి అభిషేక్ బచ్చన్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో మరో నటుడి కోసం మేకర్స్ ఇప్పుడు వెతుకుతున్నారట. అయితే అభిషేక్ కు డేట్స్ లేని కారణంగానే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ మరో రెండు రీమేక్ లో కూడా నటిస్తున్నారు. ఆర్. పార్థిపన్‌తో తమిళ థ్రిల్లర్ "ఒత్తా సెరుప్పు సైజ్ 7", "ఓ మై కడవులే" వంటి హిందీ రీమేక్‌ లలో చేయబోతున్నాడు. "ధూమ్", "దోస్తానా" చిత్రాలలో జాన్, అభిషేక్ కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ మూడోసారి కూడా తెరపై అద్భుతం సృష్టిస్తుందని అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యేలా కన్పిస్తోంది.

ఇటీవల చెన్నైలో జరుగుతున్న నెక్స్ట్ సినిమా షూటింగ్ లో అభిషేక్ బచ్చన్ చేతికి గాయమైంది. గత బుధవారం నా కొత్త సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా కుడి చేతిలో ఫ్రాక్చర్ జరిగిందని, వెంటనే ముంబై వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నాను అని అభిషేక్ తెలిపాడు. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ప్రారంభించడానికి ఆయన చెన్నైకి తిరిగి వెళ్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ రెండు సినిమాలు "బాబ్ బిశ్వాస్", "దాస్వి" విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: