బాలీవుడ్లో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ మొత్తాన్ని కదిలిస్తుంది. బుల్లితెర నుంచి వెండితెర వరకూ ఎంతో కష్టపడి గుర్తింపు తెచ్చుకు న్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అలాంటి ఒక టాలెంటెడ్ నటుడు ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం పెద్ద సంచలనంగా మారిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో బాలీవుడ్ లోని ఎంతోమంది ప్రముఖులపై కేసులు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే. ఇక ఎంతోమందిలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడంపై ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ కేసులో అటు ముంబై పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ సుశాంత్ సింగ్ స్నేహితులను బంధువులను ఇంటి పనివాళ్లను విచారించి వారందరి నుంచి వాంగ్మూలాలను సేకరించారు పోలీసులు. ఇక తాజాగా ప్రేయసి బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి ని కూడా పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా కోరగా ఈ రోజు రియా చక్రవర్తి బాంద్రా పోలీస్ స్టేషన్ కు వచ్చింది. దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో... సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు.
అయితే గత కొంత కాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న యువ హీరో సుశాంత్ సింగ్... ఈ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడాని కి ముందు తన స్నేహితుడు మహేష్ శెట్టి, ప్రేయసి రియా చక్రవర్తితో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిసిందే.ఈ నేపథ్యం లోనే బాంద్రా పోలీసులు ఇప్పటికే సుశాంత్ స్నేహితుడి వాంగ్మూలాన్ని సేకరించారు. ఇక ఈరోజు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు.