బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తన 111వ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. మాస్ యాక్షన్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గోపీచంద్ మల్లినేని ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొన్న సమయంలో, తాజాగా చిత్ర బృందం మరో సర్‌ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా బాలయ్య – మనోజ్ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించబోతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక మనోజ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అన్నదే ఇప్పుడు అందరిలోనూ పెద్ద ప్రశ్నగా మారింది. గోపీచంద్ మలినేని సినిమాల్లో పాత్రలకు ప్రత్యేకమైన బలం ఉండటం తెలిసిందే. అందుకే మనోజ్ కోసం కూడా ఓ పవర్‌ఫుల్ రోల్ డిజైన్ చేసినట్టు సమాచారం. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ పాత్ర సినిమాలో కీలక మలుపు తిప్పనుందని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. దాదాపు పద్నాలుగేళ్ల క్రితం విడుదలైన ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రంలో బాలయ్య చేసిన గెస్ట్ రోల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య సినిమాలో మంచు మనోజ్ నటించనున్నాడు. దీంతో ఈసారి ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక ఈ భారీ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చిన మాస్ బీజీఎమ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందువల్ల ఈ సినిమాకి కూడా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మొత్తానికి బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు ఇప్పుడు మంచు మనోజ్ చేరడం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ పాత్రలు, థమన్ సంగీతం కలిసొచ్చే ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: