ఏడాది క్రితం క్రితం మరణించిన కొడుకు గుండె చప్పుడు మళ్లీ విన్నాడో తండ్రి. అంతే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. గుండె బరువెక్కింది. ఇలా చనిపోయిన కుమారుడి గుండె చప్పుడు విని.. ఓ తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురైన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసింది. సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి గుండె ఇప్పుడు ఎలా కొట్టుకుంటుంది? ఇది అసాధ్యం అని అనుకుంటున్నారా? అవును.. మీ అనుమానాలు నిజమే.. అయితే చనిపోయిన తన కొడుకు గుండె చప్పుడును ఏడాది తర్వాత ఆ తండ్రి వినడం కూడా అంతే నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన స్టెఫానీ రీడ్, జాన్ రీడ్ దంపతులు ఏడాది క్రితం వరకూ సంతోషంగానే ఉండేవాళ్లు. వారికి ఓ కుమారుడు. అతన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలు 2019 జనవరిలో ఒక్కసారిగా కుదుపుకు గురయ్యాయి. ఆ తల్లిదండ్రుల మనసులను చీకట్లు కమ్మేశాయి.

ఎందుకంటే.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈ దంపతుల ఏకైక సంతానం అయిన 16ఏళ్ల కొడుకు ఆస్పత్రిలో చేరాడు. అతను బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు ప్రకటించారు. అంటే అతను బ్రతకడం కష్టం. ఒకవేళ కొంత కాలం జీవించే ఉన్నా.. అలా మంచానే పడి ఉంటాడు. ఈ విషయం తెలిసిన ఆ స్టెఫానీ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి బాధ వర్ణణాతీతం. అయితే అంతటి దు:ఖంలోనూ ఆ దంపతులు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొడుకు అవయవాలను దానం చేసి, అవసరంలో ఉన్న వేరే కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. ఈ క్రమంలో స్టెఫానీ కుమారుడి హృదయాన్ని వేరే వ్యక్తికి పునర్జన్మ ఇచ్చారు వైద్యులు. ఆ వ్యక్తి.. స్టెఫానీ, జాన్ త్యాగాన్ని, వారి మనో స్థైర్యాన్నీ మర్చిపోలేక పోయాడు. అందుకే తాజాగా ఈ దంపతులకు ఓ అరుదైన బహుమతి పంపించాడు. తన శరీరంలో ఉన్న ఆ దంపతుల కుమారుడి గుండె చప్పుడును రికార్డు చేసి.. దాన్ని ఓ టెడ్డీబేర్‌లో అమర్చి.. స్టెపానీ జంటకు కొరియర్ చేశాడు. ఆ కొరియర్‌ అందుకున్న జాన్ రీడ్.. టెడ్డీబేర్‌లో నుంచి వస్తున్న తన కొడుకు గుండె చప్పుడు విని ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ద‌ృశ్యాలను స్టెఫానీ రీడ్.. తన ఫోన్‌లో బంధించింది. పూర్తి విషయాన్ని వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: