వై.ఎస్. వివేక హత్య కేసు నిందితుల ప్రాణాల భద్రత దృష్ట్యా కడప కేంద్ర కారగార జైలర్ పి. వరుణారెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సిబిఐ డైరక్టర్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా ఉన్న వరుణారెడ్డి గతంలో దివంగత పరిటాల రవీంద్ర రాజకీయ హత్యకేసులో నిందితులుగా ఉంచబడిన అనంతపురం జిల్లా జైలు జైలర్గా పని చేసి ఉన్నారని వర్ల ఆ లేఖలో గుర్తు చేశారు. 2008 నవంబర్ 11వ తేదీ రాత్రి ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను తన జైలు గదిలోనే సహ నిందితుడి చేతిలో సిమెంట్ డంబ్ బెల్ తో దారుణంగా హతమార్చబడ్డాడని వర్ల రామయ్య ఆ లేఖలో తెలిపారు.
మొద్దు శీను హత్య ఘటనతో అప్పటి అనంతపురం జిల్లా జైలు జైలర్ వరుణారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయని.. ఆయన్ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, డంబెల్ను జైలు బ్యారక్లోకి అనుమతించినందుకు, పర్యవేక్షణలో అలసత్వం వహించినందుకు సస్పెండ్ కూడా చేశారని వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు. గతంలో వరుణారెడ్డి జైలు సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో అనంతపురం జైలులో జరిగిన సంఘటనల తరహాలోనే కడప కేంద్ర కారాగారంలో కూడా జరిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ప్రాణాలకు రక్షణ కల్పించే దృష్ట్యా వారిని కడప కేంద్ర కారాగారం నుంచి రాజమండ్రికి మార్చాలని టీడీపీ సీబీఐని కోరుతోంది. లేకపోతే వివేకానంద రెడ్డి హత్యలో కడప సెంట్రల్ జైలులో ఉన్న నిందితుల భద్రత దృష్ట్యా వరుణారెడ్డిని కడప జైలు నుంచి బదిలీ చేయాలని టీడీపీ కోరుతోంది.