వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో తెలంగాణా సిట్ (స్పెషల్ ఇన్ వెస్టిగేటివ్ టీమ్) ఉన్నతాధికారులు తెలివిగా వ్యవహరిస్తున్నట్లుంది. సిట్ కార్యాలయంలో రఘురాజు మంగళవారం విచారణకు హాజరుకావాల్సుంది. అయితే సోమవారమే ఎంపీకి సిట్ నుండి ఈ మెయిల్ వెళ్ళిందట. అందులో ఏముందంటే మంగళవారం విచారణకు హాజరుకావాల్సిన అవసరంలేదని. తాము మరో చెప్పినపుడు విచారణకు హాజరైతే చాలని చెప్పారట.





టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు కేసులో రఘురామకు సిట్ అధికారులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. నిందితులతో కలిసి దిగిన ఫొటోలు, నిందితుల మొబైల్ కాల్ లిస్టులో ఎంపీతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్లుంది. పైగా కొనుగోలు వ్యవహారంలో నిందితులు ముగ్గురిలో ఎవరో ఎంపీ పాత్రగురించి చెప్పినట్లున్నారు.  అందుకనే ఎంపీని విచారణకు సిట్ పిలిచింది. అయితే చివరినిముషంలో విచారణకు ఇపుడు వద్దంటు మెయిల్ పంపింది.




చివరి నిముషంలో మెయిల్ పంపటం వ్యూహాత్మకమే అని అనుమానంగా ఉంది. ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కూడా విచారణకు హాజరవ్వాల్సుంది. అయితే విచారణకు హాజరుకాకుండా హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. డిసెంబర్ 5వ తేదీవరకు సంతోష్ ను విచారణకు పిలవద్దని కోర్టు ఆదేశించింది. ఇపుడు అదే పద్దతిలో ఎంపీ కూడా కోర్టులో పిటీషన్ వేసున్నారు. విచారణలో కోర్టు ఎంపీకి అనుకూలంగా తీర్పిస్తే విచారణకు గ్యాప్ వచ్చేస్తుంది.





అందుకనే డిసెంబర్ 5వ తేదీవరకు వెయిట్ చేసి సంతోష్ విషయంలో అప్పుడు కోర్టు ఏమి చెబుతుందో చూద్దామని సిట్ ఉన్నతాధికారులు అనుకున్నట్లున్నారు. సంతోష్ ను విచారణకు హాజరుకావాల్సిందే అని కోర్టు చెబితే అప్పుడే రఘురాజు విషయంలో కూడా ప్రొసీడ్ అవ్వాలని అధికారులు అనుకున్నట్లున్నారు. అందుకనే తాత్కాలికంగా విచారణను వాయిదావేశారు. ఏదేమైనా ఎంపీ విషయంలో మాత్రం అధికారులు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లే ఉన్నారు. లేకపోతే అధికారులే చిక్కుల్లో పడతారు. ఎందుకంటే రఘురాజు చాలామంది ఎంపీల్లాగ కాదు. ఆర్ధికంగా చాలా పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. పైగా నరేంద్రమోడీ, అమిత్ షా తో సంబంధాలున్న వ్యక్తి. అందుకనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: