ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా... మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా వారిపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇక తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న ఐదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఓ ఐదేళ్ల చిన్నారి మూడు రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లొస్తుండగా ఇంటర్ విద్యార్థి ఆమెకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అన్యం పుణ్యం ఎరుగని ఆ బాలిక దారుణంగా లైంగిక దాడికి పాల్పడి ఏమీ ఎరుగనట్లుగా ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అసలు తనకు ఏం జరిగింది తెలియక ఆ బాలిక అలాగే ఉండిపోయిందే.
అయితే అదేరోజు సాయంత్రం బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలిక మర్మాంగాల్లో రక్తస్రావమైనట్లు గుర్తించిన డాక్టర్ ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించి తల్లిదండ్రులకు చెప్పడంతో షాక్ గురయ్యారు. ఆ వెంటనే బాలిక తల్లిదండ్రులు పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడిని గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. ఇక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.