కరోనా వైరస్‌ ప్రపంచాన్ని భయం గుప్పెట్లోకి నెట్టేసింది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి శతవిధాల ప్రయత్నాయి పలు దేశాలు. పలు యూరప్‌ దేశాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. కానీ... కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

 

కోవిడ్‌-19 పేరు వింటేనా గజగజలాడిపోతున్నారు జనం. పక్కన ఎవరైనా తుమ్మినా, దగ్గినా అనుమానంతో చూస్తున్నారు. అయితే, చైనాలో తగ్గుముఖం పడుతుండగా, ఇటలీ, ఇరాన్‌లలో కరోనా వైరస్‌ మారణహోమం కొనసాగిస్తోంది.

 

ప్రపంచ వ్యాప్తంగా లక్షా 67 వేల 291 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీళ్లలో 76 వేల 585 మంది కోలుకోగా, 85 వేల 957 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 5 వేల 913 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంత వరకూ 6 వేల 492 మంది కరోనా వైరస్‌ భారినపడి చనిపోయారు.

 

చైనాలో కరోనా వైరస్‌ కాస్త నెమ్మదించింది. చైనా ఇంత వరకూ 80 వేల 849 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం మరణాలు 3 వేల 199 మంది చనిపోయారు. తాజా అక్కడ కేవలం 25 కొత్త కేసులు, పది మరణాలు మాత్రమే నమోదయ్యాయి.

 

ఇటలీలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇటలీలో కేసుల సంఖ్య 24 వేల 747కు చేరుకోగా, కొత్తగా 3 వేల 590 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇంత వరకూ 18 వందల 09 మంది చనిపోగా, ఒక్క రోజులోనే 368 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇరాన్‌లో కూడా కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఇంత వరకూ 13 వేల 938 మంది కరోనా వైరస్‌ సోకింది. ఇందులో 12 వందల 9 కొత్త కేసులు. అలాగే, మొత్తం మరణాలు 724 కాగా, ఒక్క రోజులోనే 113 మంది కరోనా బాధితులు చనిపోయారు. 

 

స్పెయిన్‌లో కూడా కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. స్పెయిన్‌లో ఇంత వరకూ 7 వేల 843 కేసులు నమోదు కాగా, అందులో 14 వందల 52 కొత్త కేసులు. అలాగే, కరోనాతో చనిపోయిన వాళ్లు 292 మంది కాగా, ఇందులో 96 మంది ఒక్క రోజులోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరింత అప్రమత్తమైన స్పెయిన్‌ ప్రభుత్వం... వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఆఫీసుల్ని మూసివేసింది. అలాగే,  ప్రయాణాలు రద్దు చేసేకోవాల్సిందిగా ప్రజలకు సూచిస్తోంది. 

 

అటు జర్మనీలో కూడా 12 వందల 14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జర్మనీలో కరోనా వైరస్‌ బారిన పడ్డవాళ్ల సంఖ్య 5 వేల 813కు చేరింది. అలాగే, జర్మనీలో ఇంత వరకూ 11 మంది చనిపోగా, ఒక్క రోజులోనే ఇద్దరు మృతిచెందారు. ఫ్రాన్స్‌లో కూడా కరోనా విజృంబిస్తోంది. తాజాగా అక్కడ 924 కేసులు మోదయ్యాయి. దీంతో ఫ్రాన్స్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5 వేల 423కు చేరింది. మొత్తం 127 మంది మరణాలు రికార్డు కాగా, తాజాగా 36 మంది కరోనా వైరస్‌తో చనిపోయారు.

 

అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా భయంతో వణికిపోతోంది. అమెరికాలో 590 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆరుగురు చనిపోయారు. స్విట్జర్లాండ్‌లో 842 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో 251, ఆస్ట్రేలియాలో 205, మలేషియాలో 190 కేసులు కొత్తగా నమోదయ్యాయి.  
ఇజ్రాయెల్‌లో కొత్తగా నమోదైన 20 కేసులో కరోనా బాధితుల సంఖ్య 213కు చేరింది. దీంతో జెరూసలేంలోని ముస్లింల మూడో పవిత్ర క్షేత్రం అల్ అక్సా మసీదును మూసివేశారు. పాకిస్థాన్‌లో తాజాగా 20 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 53కు చేరింది. అయితే, పాక్‌లో ఇంత వరకూ కరోనా వైరస్‌తో చనిపోలేదు. మొత్తానికి కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఓ రకంగా యుద్ధమే చేస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: