కరోనా రోగి కుటుంబ సభ్యులు చేసిన చిన్న పొరపాటు ఏకంగా ఆ వ్యక్తి ప్రాణాలు పోయేలా చేసింది . ఉక్క పోస్తుంది అని వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టడంతో చికిత్స పొందుతున్న కరోనా రోగి మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 13న కరోనా వైరస్ లక్షణాలతో సుమారు 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇక అతని నుండి నమూనాలను సేకరించి కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
దీంతో ఆ వ్యక్తిని ఈనెల 15వ తేదీ నుంచి ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో ఎంతో వేడిగా ఉంది అని భావించిన ఆ రోగి కుటుంబ సభ్యులు తమ ఇంటి దగ్గర నుంచి ఒక కూలర్ ని తీసుకొచ్చారు. దానిని బాధితుడి పక్కనే ఉంచారు. ఇక అక్కడ ఒకే ఒక సాకెట్ మాత్రమే ఉంది. ఆ సాకెట్ లో వెంటిలేటర్ ప్లగ్ పెట్టి ఉంది. దీంతో ఉక్క పోస్తుంది కూలర్ పెట్టాలి అని భావించిన కరోనా రోగి కుటుంబ సభ్యులు... పొరపాటున వెంటిలేటర్స్ ప్లగ్ పీకేశారు. ఇక ఆ సాకెట్ లో కూలర్ ప్లగ్ ను పెట్టారు.
ఆ తర్వాత కూలర్ ఆన్ చేశారు. కానీ ఆ తర్వాత అరగంట వ్యవధి లోనే కరోనా చికిత్స తీసుకుంటున్న రోగి ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఇక దీన్ని గమనించిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్న ఆ వ్యక్తిని వెంటనే వైద్యులు పరీక్షించి నప్పటికీ... అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. అయితే ఐసోలేషన్ వార్డులో కూలర్ పెట్టుకోవడానికి రోగి కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమతి తీసుకోలేదు అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇక వైద్య సిబ్బంది నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించింది కమిటీ. కాగా కుటుంబ సభ్యులు మాత్రం విచారణకు సహకరించడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి