గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ పేరు వినడానికి ప్రజలు భయపడుతున్నారు. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా.. ఎప్పుడు నాశనం అవుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు ఈ కరోనా దెబ్బకు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా కరోనాను కట్టడి చేసే విరుగుడు కోసం పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. కరోనా లక్షణాల్లో దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి కడుపునొప్పి, విరేచనాలతో పాటు వాసన పసిగట్టలేకపోవడం, రుచి తెలియకపోవడం వంటివి కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా రుచి, వాసనను గుర్తించలేకపోతే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోమని సూచిస్తున్నాయి. అయితే కరోనా రోగుల్లో రుచి వాసన ఎందుకు కోల్పోతున్నారో అన్న సంగతి ఇన్నాళ్లూ వైద్యులకు శాస్త్రవేత్తలకు అంతుబట్టలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అందుకు గల కారణాలను హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణుల బృందంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనావైరస్ రోగులలో వాసన భావాన్ని కోల్పోవడం అనేది న్యూరాన్లకు నేరుగా సోకడం ద్వారా జరుగుతుందని గుర్తించారు. ఇందులోని సహాయక కణాల పనితీరును ప్రభావితం చేయడం ద్వారా ఇలా జరుగుతుందని తమ పరిశోధనలు సూచిస్తున్నాయని చెప్పారు. అలాగే వివిధ కారణాల వల్ల రుచి వాసన భావాన్ని కోల్పోవడాన్ని అనోస్మియా అంటారని కరోనా రోగులలో అనోస్మియాకు కారణం ఈ కణాలేనని తెలిపారు. ఇక రుచి, వాసన భావాన్ని కోల్పోయే కరోనా రోగుల్లో ఒకరు దానిని తిరిగి పొందలేరని.. మిగిలిన వారు మాత్రం రుచి, వాసన భావాలను తిరిగి పొందగలుగుతారని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి