హిందీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అసలు అతనిది ఆత్మహత్యా? లేక హత్యా? అనే సందేహాలకు సైతం తావిస్తున్నాయి పలు అంశాలు. కొంత మంది పనిగట్టుకుని సుశాంత్‌ సినీ జీవితాన్ని నాశనం చేశారంటున్నాడు... అతని జిమ్‌ పార్ట్‌నర్‌ సునీల్‌ శుక్లా. ఇదే అంశంపై సుప్రీం కోర్టులో అతను ఇంటర్వెన్షన్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బాంద్రా పోలీస్‌ స్టేసన్‌లో ఫిర్యాదు చేశానని చెబుతున్నాడు. సుశాంత్‌ సినిమాలు విడుదల కాకుండా చేసి... అతని సినీ జీవితాన్ని అంతం చేయాలని కొంతమంది ప్రయత్నించారంటున్నాడు సునీల్‌ శుక్లా. ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేయడం కంటే... సీబీఐకి అప్పగిస్తేనే మంచిదని తన పిటిషన్‌లో తెలిపాడు.         
 
సుశాంత్ నటించిన 'డ్రైవ్‌' చిత్రం థియేటర్లలో కాకుండా, కావాలనే ఓటీటీ ఫాంలో విడుదల చేశారంటున్నాడు సునీల్‌ శుక్లా. మకావులో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో కూడా సుశాంత్‌ను అపహాస్యం చేశారనేది సునీల్‌ ఆరోపణ. ఇలా సుశాంత్‌ను పలుమార్లు అవమానించి, మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేశారంటున్నాడు. సుశాంత్‌కు సంబంధించిన చాలా సమాచారం తన వద్ద ఉందని చెబుతున్నాడు సునీల్‌. దీనిపై ఇప్పటికే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని... అయితే తన స్టేట్‌మెంట్‌ రికార్టు చేయడానికి పిలవలేదన్నాడు. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్టు చెబుతున్నాడు సునీల్‌ శుక్లా.         

తన స్నేహితురాలు, నటి అంకిత లోఖండే ఫ్లాట్‌ ఈఎమ్ఐలను సుశాంత్‌  కడుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతో అంకిత వాటిని ఖండించింది. తన ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలతో పాటు ఈఎమ్ఐలకు సంబంధించి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ విషయంలో తాను వీలైనంత పారదర్శకంగా ఉంటానని తెలిపారు. తన ఫ్లాట్‌కు సంబంధించి తన బ్యాంక్‌ ఖాతా నుంచి నెల నెలా ఈఎమ్ఐలు కట్‌ అవుతున్నాయని, ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది  అంకిత.  సుశాంత్ ఫ్లాట్ నంబరు 403 కాగా, అంకిత ఫ్లాట్ నంబరు 404. ఎవరికి వారు తమ ఫ్లాట్ల ఈఎమ్ఐలు కడుతున్నా... పక్కపక్క ఫ్లాట్స్‌ కావడం వల్ల కొంత గందరగోళానికి దారితీసింది.         

ఇంకోవైపు... సుశాంత్‌ మృతిపై అనుమానులు కొనసాగుతూనే ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయం మిస్సయ్యిందంటున్నారు అతని ఫ్యామిలీ లాయర్‌ వికాశ్‌ సింగ్‌. సుశాంత్‌ ఎన్ని గంటలకు మృతిచెందాడనే విషయంలో పోస్టుమార్టంలో లేదన్నారు. మృతి చెందిన సమయాన్ని బట్టి... సుశాంత్‌ది హత్యో? ఆత్మహత్యో? తేలిపోతుందన్నారు. ఈ ప్రశ్నకు ముంబై పోలీసులతో పాటు కూపర్‌ ఆస్పత్రి డాక్టర్లు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు వికాశ్‌ సింగ్‌. ముంబై పోలీసులపై మంత్రుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని... అందువల్లే సక్రమంగా తమ విధులు నిర్వహించలేకపోతున్నారని ఆరోపించారు.  

జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో చనిపోయి కనిపించాడు సుశాంత్. అతనిది ఆత్మహత్యగా మొదటి నుంచి చెబుతున్నారు పోలీసులు. అయితే మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. మృతదేహాన్ని తరలించిన అంబులెన్స్‌ సిబ్బంది చెప్పిన విషయాలు కూడా పలు సందేహాలకు తావిచ్చాయి. సుశాంత్‌ శరీరం పసుపుగా మారిపోయిందని, మోకాలు విరిగిపోయిందని చెప్పారు. ఆత్మహత్యల సందర్భాల్లో ఇలా జరగడం తామెప్పుడూ చూడలేదన్నారు అంబులెన్స్‌ సిబ్బంది. అలాగే సుశాంత్‌ సింగ్‌ మెడ చూట్టూ తాడు బిగించినట్టు ఉన్న మరకపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సుశాంత్‌దే ఆత్మహత్యేనంటూ పోస్టుమార్టం నివేదిక ఇచ్చారు డాక్టర్లు. అయితే... పోస్టుమార్టం నివేదికపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: