తిండి కలిగితే కండ కలదోయ్‌ అంటారు.. అలా అని ఏది పడితే అది విపరీతంగా తింటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ మంది ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం కన్నా, కొవ్వులు, గ్లూకోజ్‌లు పుష్కలంగా ఉండే వాటినే లాగించేస్తున్నారు. దాంతో శరీర ఆకృతి దెబ్బతినడంతో పాటు లేని పోనీ జబ్బులొస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లపై ఇటీవల ఎన్ఐఎన్, ఐసీఎమ్ఆర్ చేసిన సర్వేలో ఇదే విషయం తేలింది.

దేశంలో మనవాళ్ల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, ఇండియన్‌  కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయం రుజువైంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై సర్వే చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు నిర్దారించాయి.

దేశాన్ని ఈస్ట్ , వెస్ట్ , నార్త్ ,  సౌత్... సెంట్రల్, నార్త్‌ ఈస్ట్‌గా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లు... తీసుకుంటున్న విధానాన్ని 24 గంటలను ఒక యూనిట్‌ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ.. తీసుకునే విధానం మాత్రం ఎక్కడ సరిగా లేదు.

ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను,  దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది.

దేశవ్యాప్తంగా తృణ, చిరుధాన్యాల వినియోగం బాగా పెరిగింది. అయితే పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని ఎక్కువగా లాగించేస్తున్నారు. ఇదే సమయంలో అధిక పోషకాలు ఉండే కూరగాయలు,ఆకు కూరలు, పాలు, పప్పుధాన్యాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు,  చేపలను తినాల్సిన దానికంటే తక్కువే తింటున్నారని తెలిపింది. ప్రత్యేకించి పట్టణ ప్రజలైతే తగినన్ని పోషక విలువలున్న ఆహారం తినకపోయినా చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లను తెగ లాగించేస్తున్నారని ఎన్ఐఎన్ అంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: