తూర్పు లడఖ్లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న దేశ జవాన్లకు వసతి సదుపాయాలను మెరుగుపరిచింది భారత సైన్యం. జవాన్ల కోసం బెడ్ లు, ప్రత్యేక కప్బోర్డులతో పాటు గదుల్లో విద్యుత్, నీటి సరఫరా, హీటర్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రిపై మంచు కప్పకుండా ఉండేందుకు ప్రత్యేక షెల్టర్లను నిర్మించింది.
సముద్రమట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువకు పడిపోతాయి. నవంబరులో ఈ ప్రాంతంలో మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. బలమైన చలిగాలులు వీస్తుంటాయి. ఒక్కోసారి 40 అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంటుంది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో భారత జవాన్లు ఇక్కడ దేశ రక్షణ కోసం పహారా కాయడం పెను సవాలే. అలాంటి జవాన్ల కోసం వసతిని మెరుగుపరిచింది భారత సైన్యం. ఫ్రంట్లైన్లో విధులు నిర్వహించే బలగాల కోసం హీట్ టెంట్లు ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది మే నుంచి చైనా కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. లడఖ్లో మరింతకాలం భారత బలగాల మోహరింపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు దశల్లో బలగాలను ఉపసంహరణకు ఇరు దేశాల అధినేతలు అంగీకారానికి వచ్చినట్లు వార్తలు వచ్చినా... అది ఇప్పట్లో కార్య రూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి