ఏపీ ఎంసెట్–2020 ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్ కాపీలు మాత్రమే సమర్పించాలని అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా వారు తాము ఎంపిక చేసుకున్న కాలేజీలో సమర్పించాలి. కాలేజీని సెలక్ట్ చేసుకున్న విద్యార్థులు దాన్ని నిలుపుకోవాలంటే.. 2021 జనవరి 8లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, ఆ తర్వాత కాలేజీలో రిపోర్టు చేయని వారి అలాట్ మెంట్ సీటును ఖాళీగా పరిగణిస్తారని తెలిపారు అధికారులు. తరువాత కౌన్సెలింగ్ సమయంలో వీరికి మొదట కేటాయించిన సీటు రద్దు అవుతుంది. రెండో కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల్లో అర్హులకు దాన్ని కేటాయిస్తారు.
తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే.. క్రిమినల్ చర్యలు..
విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో తప్పులున్నట్టు తేలితే.. ఆ అభ్యర్థికి కేటాయించిన సీటు ఆటోమేటిక్ గా రద్దవుతుంది. అంతే కాదు, వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు అధికారులు. అభ్యర్థులు అడ్మిషన్ల సమయంలో సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లను కేవలం పరిశీలన చేయించుకుని తిరిగి తమ వెంట తీసుకెళ్లే అవకాశం కల్పించారు. తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలుచేయకూడదని స్పష్టం చేశారు అధికారులు. తొలి విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభం అయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి