ఆస్ట్రేలియా గడ్డపై గ్రాండ్ విక్టరీతో జోష్ మీదున్న టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్కు సిద్ధమవుతోంది. పితృత్వ సెలవుపై పింక్బాల్ టెస్టు అనంతరం భారత్కు వచ్చిన విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టగా... ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. ఆసీస్ గడ్డపై సత్తా చాటిన రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నారు.
మొదట 4మ్యాచ్ల టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న ప్రారంభమవుతుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో తొలి రెండు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు అహ్మదాబాద్ ఆతిథ్యం అందించనుంది. మార్చి 12నుంచి ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇరు జట్ల మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్కు పుణె వేదిక కానుంది. మార్చి 23న తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. మార్చి 28న చివరి వన్డేతో మూడు ఫార్మాట్ల సిరీస్ ముగుస్తుంది.
ఈ నెల 27న భారత్, ఇంగ్లండ్ జట్లు చెన్నై చేరుకుంటాయి. కరోనా ఎఫెక్ట్తో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. చిదంబరం స్టేడియంలో జరిగే తొలి రెండు టెస్టులను క్లోజ్డ్ డోర్స్ మధ్యే నిర్వహించాలని నిర్ణయించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ రెండు టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనుంది. బీసీసీఐ ఆదేశాల ప్రకారం ఇక్కడ జరిగే రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించబోమని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి