తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది పూర్తవుతుంది. ఈ కాలంలో మహమ్మారి 16 వందల 43 మందిని బలి తీసుకుంది.. ఎన్నో రకాలుగా ప్రజలు నష్ట పోయారు.. అయితే జీవన విధానంలో మార్పులు, జాగ్రత్తలతో ప్రస్తుతం కరోనా తగ్గు ముఖం పట్టింది.. కానీ రిలాక్స్ అవుతున్న సమయంలో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
రాష్ట్రంలో ఏడాది కాలంలో కరోనా అనేక పాఠాలు నేర్పింది. ఎన్నడూ ఎరుగని కొత్త అలవాట్లను సాధారణ జీవనం లో ఖచ్చితంగా ఆచరించేలా చేసింది. ముఖానికి మాస్క్ లేకుండా బయటికి రావద్దని చెప్పింది. ఏది తాకిన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని గుర్తు చేసింది. గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. గడిచిన ఏడాదిలో ప్రజలంతా వీటిని పాటించక తప్పలేదు. ఏడాది నాటికి తెలంగాణలో దాదాపు మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గత మూడు నెలలుగా వైరస్ వ్యాప్తి నెమ్మదించింది.
విదేశాలకు వెళ్లి బెంగుళూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి మార్చి 2న తొలి కేసుగా నమోదు అయింది.. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికుల్లో పరీక్షలు నిర్వహించారు.. అనంతరం మర్కజ్ ఉదంతంతో రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగాయి.. తొలి కేసు నమోదు కాగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.. గాంధీ ఆస్పత్రి ని కరోనా ట్రీట్మెంట్ కు కేటాయించింది. అయినా రెండో దశ వస్తుందేమో అని టెన్షన్ తప్పడంలేదు ఇప్పటికే కొత్త కేసులు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తానికి కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించుకుంటూ పోతూనే ఉంది.