రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి.. నిన్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. కడప జిల్లాలో టీడీపీ నేతలు వెనకడుగు వేశారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో మంగళవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలు నిర్వహించాల్సిన మొత్తం 8 పురపాలక సంఘాలకు 7 చోట్ల మాత్రమే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రక్రియను నిర్వహంచారు. పులివెందుల పురపాలక సంఘంలో ఇప్పటికే మొత్తం 33 వార్డు కౌన్సిలరు స్థానాలు ఏకగ్రీవం కావడంతో తదుపరి ఎన్నికల ప్రక్రియ జరపాల్సిన అవసరం ఎక్కడా కనపడలేదు.


ఇక మిగిలిన 7 పురపాలక సంఘాల్లో తొలిరోజు మొత్తం 211 మంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో పులివెందులతో కలిపి మొత్తం 100 వార్డులు ఏకగ్రీవమైనట్లు తెలిసింది. వీరంతా వైకాపా అభ్యర్థులు, సానుభూతిపరులేనని సమాచారం. ఈ స్థానాల ఏకగ్రీవాలపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. మరో వైపు మైదుకూరు పురపాలక సంఘంలో 5 నామపత్రాలను ఉపసంహరించుకోగా.. వీటిలో వైకాపా 4, తెదేపా 1 ఉన్నాయి. ఇక్కడ ఏకగ్రీవాలు జరగకుండా చూసేందుకు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. తమ పార్టీ అభ్యర్థులతో ఉపసంహరణకు వీల్లేకుండా వారిని రహస్య ప్రాంతానికి తరలించగా నేటి సాయంత్రం వారు తిరిగి రానున్నట్లు సమాచారం. మైదుకూరులో గతేడాది 144 నామపత్రాలను ఆమోదించగా ఉపసంహరణలతో 139కి చేరింది.


జమ్మలమడుగు నగరపంచాయతీలో 15 నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. వీటిలో వైకాపా 7, భాజపా 2, జనసేన 1, స్వతంత్ర అభ్యర్థులు 5 మంది ఉన్నారు. 18, 19 వార్డుల్లో ఒకే నామినేషన్‌ ఉండడంతో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు తెలిసింది. కడప నగరపాలకసంస్థలో 70 నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. వీటిలో వైకాపా 14, తెదేపా 18, జనసేన 1, కాంగ్రెస్‌ 11, సీపీఎం 2, భాజపా 4, స్వతంత్ర అభ్యర్థులు 20 మంది ఉన్నారు. ఇప్పటివరకు 17 కార్పొరేటర్‌ స్థానాలను వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నట్లు సమాచారం. ఇదే తంతు మిగిలిన స్థానాల్లో కూడా కొనసాగింది. ఇక మొత్తంగా చూసుకుంటే కడప మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్చి 15 న జరగనున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీ నేతలు జెండాను ఎగురవేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: