కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కరోనాతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్టు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే ఆస్పత్రి బిల్లులు చాలా ఎక్కువయ్యాయని దాతలు ఎవరైనా ముందుకొచ్చి.. సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ కోరుతున్నారు.

కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై హెల్పింగ్ స్టార్ సోనూసూద్ ఆరాతీశారు. శివశంకర్ చిన్న కుమారుడు అజయ్ తో ఫోన్ లో మాట్లాడారు. శివశంకర్ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అయితే ఆయన పెద్ద కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివశంకర్ ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలిపారు.

కోవిడ్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు మెగాస్టార్ చిరంజీవి బాసటగా నిలిచారు. మాస్టర్ చిన్నబ్బాయి అజయ్ ను ఇంటికి పిలిచిన మెగాస్టార్.. అతడికి తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. చికిత్స అవసరాలు తెలుసుకున్న చిరు.. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సాయం పట్ల అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు హీరో ధనుష్ కూడా చికిత్స పొందుతున్న శివశంకర్ మాస్టర్ కు అండగా నిలిచారు. మాస్టర్ ఆస్పత్రి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు సాయం చేశారు. అయితే ఈ విషయాన్ని హీరో గుట్టుగా ఉంచగా.. చివరకు బయటికొచ్చింది. అటు ఇప్పటికే శివంకర్ చిన్న కొడుకుతో మాట్లాడిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్.. ఆయనకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇక శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆరాతీశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే మాస్టర్ చిన్న కుమారుడికి ఫోన్ చేసి.. ధైర్యం చెప్పినట్టు వివరించారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అయితే కరోనాతో బాధపడుతున్న శివశంకర్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. శివశంకర్ మాస్టర్ తో పాటు ఆయన కుమారుడు సైతం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు.. శ్రేయోభిలాషులు పూజలు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: