![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/mudragada-pawan-jogaiah5696ea16-8197-4410-822f-c6d19e8aee62-415x250.jpg)
రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీతో సీట్ల సర్దుబాటు తర్వాత కాపుల్లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. రెండు జిల్లాల్లోని ఇద్దరు కాపు ప్రముఖులు పవన్ కు రాసిన ఘాటు లేఖలే దీనికి ఉదాహరణ. ఇద్దరు ప్రముఖులు చేగొండి హరిరమాజోగయ్య, ముద్రగడ పద్మనాభం చెరోపక్కాచేరి పవన్ను వాయించేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో జెండా బహిరంగసభ జరిగిన రోజే జోగయ్య తన లేఖలో పవన్ను ఘాటుగా నిలదీశారు. గురువారం ముద్రగడ రాసిన లేఖలో వ్యంగ్యంతను జోడించి పవన్ను కడిగేశారు.
నిజానికి పై ఇద్దరికీ ఏమాత్రం పడదు. జోగయ్య పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేత, ముద్రగడేమో తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖుడు. ఇద్దరు చెరో జిల్లాకు చెందిన వారు కావటంతో వీళ్ళమధ్య ఎప్పుడూ వివాదం తలెత్తలేదు. ఇద్దరికీ పడకపోయినా ఒకళ్ళు మరోకళ్ళ విషయంలో జోక్యం చేసుకోలేదు. అలాంటిది ఇద్దరు ఇపుడు ఏకమయ్యారు. ఏ విషయంలో అంటే పవన్ను వాయించేయటంలో. పవన్ వైఖరి వల్ల కాపులకు తీరని అన్యాయం జరగబోతోందని ఇద్దరు కూడా తీవ్రంగా ఆందోళన పడుతున్నారు.
సీట్ల షేరింగులో పవన్ 50-60 సీట్ల మధ్య తీసుకుంటే కాని రెండుపార్టీల మధ్య ఓట్లబదిలీ జరగదని జోగయ్య కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు. ముద్రగడేమో 80 సీట్లు తీసుకునుండాలని సూచించారు. అయితే పవన్ వీళ్ళిద్దరినీ లెక్కచేసే స్ధితిలో లేరు. పార్టీ నేతలనే పట్టించుకోని పవన్ ఇక వీళ్ళిద్దరిని పట్టించుకోకపోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు. చంద్రబాబు-పవన్ మధ్య బయటకు కనిపించని బంధమేదో బలంగా ముడిపడుంది. అందుకనే తనపైన ఎవరెంత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా, ఎన్ని సెటైర్లు పేలుతున్నా, ఎంతమంది ప్రశ్నిస్తున్నా పవన్ లెక్కచేయటంలేదు. పైగా తనకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అవసరంలేదని తేల్చేశారు.
వస్తే తనను ప్రశ్నించకుండా తనతో కలిసి నడవాలని లేకపోతే అన్నీ మూసుకుని కూర్చోమని అర్ధమొచ్చేట్లుగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏమైందంటే కాపుల్లోనే పవన్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. కాపు సామాజికవర్గంలో వాళ్ళకంటు మంచిగుర్తింపుంది. అలాంటివాళ్ళకే పవన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడటంతో కాపులు మండిపోతున్నారు. పైగా రాజమండ్రిలో పవన్ ప్రకటించిన రాజమండ్రి రూరల్ సీటును చంద్రబాబు తీసేసుకోవటం, నిడదవోలులో పోటీచేయమని పవన్ చెప్పగానే టీడీపీ నేతలు నానా రచ్చ చేయటాన్ని కాపులు బాగా అవమానంగా ఫీలవుతున్నారు. ఇప్పుడే పరిస్ధితి ఇలాగుంటే మిగిలిన సీట్లను కూడా ప్రకటిస్తే గొడవలు ఇంకెంత స్ధాయికి వెళతాయో అర్ధంకావటంలేదు.