ఏకంగా ఎన్నికల సమయంలో రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములే ప్రత్యర్ధులుగా మారిపోయి.. రెండు పార్టీల తరఫున పోటీ చేస్తూ ఒకరిపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకొన్ని చోట్ల ఒకే కుటుంబానికి చెందిన నేతలు ఇలా ఎన్నికల బరిలో నిలిచి సొంత కుటుంబీకులనే ఓడించేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి.. అయితే ఇక ఒడిశా రాజకీయాలలో మాత్రం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒక కాంగ్రెస్ సీనియర్ నేతకు దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు కొడుకులు ఎన్నికల బరిలో ఉండగా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయారు ఆయన.
ఒడిస్సా అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత చింతామణి సామాత్రాయ్ (84) పరిస్థితి ఇలా దయనీయంగా మారిపోయింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన చికితి అసెంబ్లీ స్థానంలో చిన్న కొడుకు మనోరంజన్ బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇంకేముంది చిన్న కొడుకుకు ఆయన సపోర్ట్ చేయొచ్చు కదా అనుకుంటున్నారు కదా. అయితే ఇదే నియోజకవర్గ నుంచి ఆయన పెద్ద కొడుకు రవీంద్రనాథ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఎవరికి మద్దతు పలికాలి అనే విషయంపై ఆయన ఎటు తేల్చుకోలేకపోతున్నారు. తను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే అన్న విషయాన్ని తెలుపుతూ.. ఇక ఎవరి తరుపున ప్రచారం చేయకుండా సైలెంట్ గానే ఉండిపోతున్నారు.