![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/palakurthy-yashaswini-reddy-jhansi-reddy-congress-brs-errabelli-dayakar-raod08df631-4733-46b4-8c06-9e42d9f1a60f-415x250.jpg)
•26 ఏళ్ళకే ఎమ్మెల్యేగా రికార్డు
• యూత్ ఐకాన్ గా మంచి గుర్తింపు
ప్రస్తుత కాలంలో చాలామంది యువత రాజకీయాల్లోకి రావడానికి జంకుతున్నారు. కానీ వారందరికీ యశస్విని రెడ్డి స్ఫూర్తిగా చెప్పవచ్చు. కేవలం 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. మళ్లీ ఆమె గెలిచింది ఆషామాషీ అభ్యర్థి మీద కాదు దాదాపుగా 45ఏళ్ల నుంచి రాజకీయాలను శాసించిన వ్యక్తిపై జెండా ఎగరేసింది. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలం అనేది యశస్విని రెడ్డి నిరూపించింది అని చెప్పవచ్చు. ఇలాంటి యశస్విని రెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇతర వివరాలు ఏంటో చూద్దాం..
బయోగ్రఫీ:
మామిడాల యశస్విని రెడ్డి వయసు 26 సంవత్సరాలు మాత్రమే. ఈమె హైదరాబాదులోని జెఎన్టియులో బీటెక్ పూర్తి చేసింది. ఏమాత్రం రాజకీయంలో అనుభవం లేని యశస్విని రెడ్డి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి తనయుడైన రాజా రామ్మోహన్ రెడ్డిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత యశస్విని రెడ్డి అమెరికాకు వెళ్లి వారి బిజినెస్ లు చూసుకుంటూ జీవనం సాగించేది. కాలిఫోర్నియాలోని వారి సంస్థ అయిన రాజ్ ప్రాపర్టీస్ లో ఆఫీస్ మేనేజర్ గా వ్యవహరించేది. నిజానికి యశస్విని రెడ్డికి రాజకీయ అరంగేట్రం చేయించింది అత్తగారైన ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డి పూర్వీకులంతా పాలకుర్తికి చెందిన వారే. అందుకే యశస్విని రెడ్డి అత్తగారైన ఝాన్సీ రెడ్డికి ఆ నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. ఝాన్సీ రెడ్డి భర్త రాజేందర్ రెడ్డి బాల్యం ఇక్కడే గడిచింది. ఆ తర్వాత రాజేందర్ రెడ్డి ఝాన్సీ రెడ్డిని పెళ్లి చేసుకొని కొన్నాళ్లు హైదరాబాదులో ఉండి, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోయారు. ఈమె అమెరికాలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించింది. అలా అని సైలెంట్ గా ఉండకుండా అమెరికాలోనే ఉంటూ పాలకుర్తిపై ఉన్న ప్రేమతో ఇక్కడ తన అనుచరుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేది. పేద ప్రజలకు దానధర్మాలు చేస్తూ వచ్చేది. ఈ విధంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఝాన్సీ రెడ్డి, రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ సేవలు చేయవచ్చని భావించిన ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకుంది. కానీ ఆమె పౌరసత్వం సమస్యగా మారడంతో ఝాన్సీ రెడ్డి తన రాజకీయ వారసురాలిగా తన కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దించింది.
దయాకర్ రావు వర్సెస్ యశస్విని రెడ్డి:
పాలకుర్తి నియోజకవర్గం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు వినపడుతుంది. ఇప్పటికే ఆయన వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలుపొందారు. దాదాపు 40ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులు కూడా పొందారు. అలాంటి ఉద్దండ నాయకున్ని కూడా తన చరిష్మాతో మాటల తూటాలతో మడత పెట్టేసింది యశస్విని రెడ్డి. అలాగే యూత్ లో అవేర్నెస్ నింపింది. చివరికి 46 వేలకు పైగా ఓట్లతో ఆమె మెజారిటీ సాధించింది.
సవాళ్లు :
పాలకుర్తి ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి నామినేషన్ వేయాలనుకుంది. కానీ ఎర్రబెల్లి అనేక విధాలుగా అడ్డుకున్నారు. చివరికి తన అభ్యర్థిత్వం వర్తించదని ఒక ప్లాన్ చేశారు. అయినా ఝాన్సీ రెడ్డి తగ్గకుండా కోడల్ని బరిలోకి దింపింది. దీంతో పాలకుర్తి రాజకీయాలన్నీ చేంజ్ అయిపోయాయి. కోడలు కూడా అత్త మాట ప్రకారమే బరిలోకి దిగి, తన మాటల తాకిడితో అద్భుత ప్రచారాన్ని నిర్వహించింది. బీఆర్ఎస్ నుంచి ఒత్తిళ్లు మొదలైన కానీ వాటన్నింటిని అధిగమించి, తనదైన శైలిలో దూసుకుపోయారు. ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల వల్ల జరిగినటువంటి కష్టనష్టాలను వివరించింది. తాను గెలిస్తే ఏం చేయబోతుందో కూడా ప్రజలకు వివరించింది. ముఖ్యంగా యూత్ లో అవేర్నెస్ వచ్చేలా చేసిన యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో గత 30 ఏళ్ల రికార్డును తిరగరాసింది. చివరికి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యి రికార్డు క్రియేట్ చేసుకుంది.