పానీపూరి పేరు వినగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. ఈమధ్య అన్ని ప్రాంతాలలో కూడా పానీపూరి సెంటర్లు వచ్చేసాయి. తాజాగా జార్ఖండ్ లో జరిగిన ఒక సంఘటన పానీ పూరి తినాలంటేనే ఆందోళనకు గురి చేసేలా చేస్తోంది. జార్ఖండ్ లో పానీపూరి తిని 45 మందికి పైగా తీరమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఒకే ప్రాంతంలో పానీ పూరి తిన్న వీరందరూ కూడా అధిక జ్వరం, కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. ఇందులో ఒక ఆరేళ్ల బాలుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది.


దీంతో ఈ వేసవికాలంలో పానీ పూరి తినడం సురక్షితమైనదేనా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. అసలు వేసవికాలంలో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయంపై నిపుణులు కొన్నిటిని తెలియజేస్తున్నారు. వేసవికాలంలో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది. పానీపూరి బండి వద్ద ఉపయోగించే నీరు చాలా గంటల తరబడి బయటే ఉంటుంది. ఆ నీరు కలుషితమైన లేదా చింతపండు, మసాలాలు పాడయినా కూడా అవి మన జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుందని ఇదే ఫుడ్ పాయిజన్ గా మారుతుందని చెబుతున్నారు.


పానీ పూరి నీటి తయారీలో అపరిశుభ్రమైన నీటిని వాడడం వల్ల కూడా కలరా టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అధిక వేడి వల్ల మన శరీరంలో ఉండే నీటిని ఎక్కువగా కోల్పోతాం. దీనికి తోడు ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు విరేచనాలు అయితే కచ్చితంగా డిహైడ్రేషన్ కు శరీరం గురవుతుందని చెబుతున్నారు. దీనివల్లే ప్రాణపాయస్థితిలోకి చేరుతారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు ఉడకబెట్టిన బంగాళదుంపలను,శనగలను మరసటి రోజు కూడా అలాగే ఉపయోగిస్తున్నారని, వేడి వల్ల అవి త్వరగా కుళ్ళిపోయి విషపూరితంగా మారుతున్నాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. వేసవికాలంలో ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: