సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుండి చాలా వాడి వేడిగా ఉన్నాయి. చంద్రబాబునాయుడు అండ్ కో అసలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యిందే గొడవలు చేయటానికి అన్నట్లుగా ఉంది. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇచ్చే అంశంపై సభలో చాలా పెద్ద గొడవే అయ్యింది. కావాలనే చంద్రబాబు అండ్ కో గొడవ పెట్టుకున్నట్లు అందరికీ అర్ధమైపోతోంది. ఎందుకంటే తుపాను కారణంగా నష్టపోయిన రైంతాంగం విషయంలో సర్వే జరుగుతోందని దాని లెక్కలు అందగానే అవసరమైన సాయం చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇన్ పుట సబ్సిడి విడుదల చేయటంతో పాటు రంగుమారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుందని స్పష్టంగా చెప్పినా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వం అందించాల్సిన సాయాన్ని తక్షణమే మొదలుపెట్టాలుంటు ఒకటే గోల చేశారు.




ఎక్కడైనా తుపాను ప్రభావం పోకుండానే లేదా భారీ వర్షాలు కురుస్తున్నపుడు నష్టాలను అంచనా వేయటం సాధ్యంకాదు. తుపాను లేదా భారీ వర్షాల ప్రభావం తగ్గిపోయిన తర్వాత మాత్రమే  పంట నష్టాలపై అంచనాలు మొదలవుతాయి. అంచనాలు పూర్తయి ప్రభుత్వానికి అందేటప్పటికి కొంత సమయం పడుతుంది. అప్పుడు జరిగిన నష్టంలో కేంద్రం ఎంతిస్తుంది లేకపోతే మొత్తం రాష్ట్రమే భరించాలా అనే విషయం డిసైడ్ అవుతుంది. తర్వాతే ప్రభుత్వం తరపున సహాయ కార్యక్రమాలు మొదలవుతాయి. ఇది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు తెలీక కాదు. అయినా ఏదో ఓ వంక పెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లాలని డిసైడ్ చేసుకునే సభలోకి అడుగుపెట్టారు కాబట్టే ఇంత గోల చేశారు. తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో ఊగిపోవటం, ప్రభుత్వాన్ని నానా మాటలు అనటం, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి నిరసనగా కూర్చోవటం ఇదంతా గేమ్ ప్లానులో బాగమని అర్ధమైపోతోంది.




కరోనా వైరస్ కారణంగా చంద్రబాబు అసలు అసెంబ్లీకి వస్తారా ? రారా అనేదే డౌటుగా ఉన్నది. అలాంటిది సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి ఏదైనా నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇస్తే బాగుండేది. అలా కాకుండా కావాలనే గొడవలు పెట్టుకోవటం, జగన్ చెబుతున్నది వినకుండా తనిష్టం వచ్చినట్లు సభలో మాట్లాడుతానని పట్టుబట్టడం చూస్తుంటే ఎంత పెద్ద ప్లానుతో సభలోకి అడుగుపెట్టారో అర్ధమవుతోంది. చంద్రబాబు చేష్టల వల్ల సభకు ఎటువంటి ఉపయోగం లేకపోగా సభా సమయం అంతా వృథాపోతోంది. ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేస్తే ఎత్తి చూపటంలో వెనకాడాల్సిన అవసరం లేదు. కానీ ఉద్దేశ్యపూర్వకంగానే గొడవలు పడితే ఇక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటం ఎందుకబ్బా ? సభ నుండి ఒక్కరోజు సస్పెండ్ అవ్వటానికా ?


మరింత సమాచారం తెలుసుకోండి: