కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగాఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. గతంలో అమెరికాకు వీసా దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో చిలుకూరు బాలాజీకి మొక్కుకున్న చాలామందికి వెంటనే వీసా వచ్చేసింది. అప్పటి నుంచి వీసా కావాలంటే చిలుకూరు బాలాజీకి మొక్కుకోవడం సర్వసాధారణంగా మారింది. అందుకే చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుచుకుంటారు. చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది. వారానికి 75 వేల నుంచి లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

 

శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా.. కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించు’.. అని చెప్పి మాయమయ్యాడట! నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.

 

 అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో 1963లో ‘రాజ్యలక్ష్మి’ అమ్మవారిని ప్రతిష్ఠించారు. నాలుగేళ్ల కిందట దేవాలయం వద్ద నూతనంగా ఆలయ గోపురాన్ని నిర్మించారు. రెండేళ్ల కిందట పురాతన ధ్వజస్తంభాన్ని తొలగించి, నారేపచెట్టుతో రూపొందించిన కొత్త ధ్వజాన్ని ఏర్పాటు చేశారు. ఆ పై గరుత్మంతులవారి గుడిని నిర్మించారు. పూలంగి, అన్నకోట, బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: