ప్రస్తుతం భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భవంతుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం తిరుమలలో నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశాడని అందరికీ తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది. సామాన్య భక్తులు మొదలు విఐపీలు, వివిఐపీ లు మరియు అసాధారణ భధ్రతా ప్రముఖులు స్వామి వారి ఆశీస్సులు పొందటానికి తిరుమల వస్తుంటారు. అయితే తిరుమలలో మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.
అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో ఉంటుందట. అయితే పూజారులు ఎన్ని సార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అలాగే గర్భగుడిలో నుండి తీసేసిన పూలన్నీ కూడా బయటికి తీసుకుని రాకుండా.. గర్భగుడిలో స్వామి వారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. అదేవిధంగా, శ్రీవారి ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు, తదితర ఎన్నో పదార్ధాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు.
ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరం. అలాగే శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామి వారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది చాలా స్పష్టంగా వినిపిస్తుందట. ఇక మరో విషయం ఏంటంటే.. సాధారణంగా శ్రీవారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు మనందరికీ కనిపిస్తుంది. కానీ, నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు అన్నది వాస్తవం. మరియు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడకపోవడం మరో విశేషం.