కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ హిందూ దేవస్థానం... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీటీ), ఈ దేవస్థానం యొక్క ఆస్తులపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం పాలక మండలి సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆస్తులపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఆస్తులకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసి, పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘‘టీటీడీకి దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు ఉన్నాయి. టీటీడీకి మొత్తం 8,088.89 ఎకరాల స్థలాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 335.23 ఎకరాలు అమ్మకం చేశారు. ప్రస్తుతం స్వామివారికి 987 ఆస్తులు ఉన్నాయి. ఇందులో 7,753.66 ఎకరాల భూమి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కమిటీ వేస్తున్నాం. త్వరలో ఈహెచ్‌ఎస్‌ స్కీంను అమలు చేస్తాం’’ అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


అంతేకాకుండా స్వామివారి కానుక డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే కొనసాగించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించిన్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. ఇక, డిసెంబర్ 27 నుంచి 10 రోజుల‌ పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం 10 రోజుల‌ పాటు తెరిచే ఉంచాలని భక్తులు కోరారని, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దేశంలో‌ని ప్రధాన పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 10 రోజుల‌ పాటు భక్తులకు స్వామి దర్శనం‌ కల్పిస్తామని ఆయన వెల్లడించారు.


‘‘భక్తులు విరాళంగా ఇచ్చిన‌ ఆస్తులను అమ్మడానికి వీల్లేకుండా శ్వేత పత్రం విడుదల చేశాం. తిరుమలలోని‌ ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారానికి బంగారు తాపడంపై చర్చించి‌ నిర్ణయం‌ తీసుకున్నాం. ప్రైవేటు సెక్యూరిటీ వారికి యూనిఫాం అలవెన్స్‌గా రూ. 2,000 ఇవ్వాలని నిర్ణయించాం. కాలు నడక భక్తుల‌ కోసం షెల్టర్ కూడా ఆధునీకరణ‌ పనులు చేపడుతున్నాం. గాలి గోపురాల మరమ్మత్తులకు నిధుల కేటాయించాం. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాం. తిరుమలను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు 100 నుండి 150 బస్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో గ్రీన్‌పవర్ వాడేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానించారు.


తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం కోసం ‌నిధులు కేటాయించాం. సాధారణ భక్తులకు కేటాయించే కాటేజీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నాం. ధర్మ రథాలు ధర్మ ప్రచార పరిషత్ కోసం తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో పేదల వివాహం కోసం కల్యాణ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభిస్తాం. బాల‌ మందిరాల్లో అనాధ పిల్లల సౌకర్యార్థం పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. చెన్నై వలందురు‌ పేటలో నాలుగు ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. జాతీయ‌ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనే టీటీడీ డిపాజిట్లు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నామని’’ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: