విఘ్న నాయకునికి  వేంకటేశ్వరుని పట్టువస్త్రాలు
విఘ్నాలను తొలగించే గణపతికి  ఆదిదేవుడైన వేంకటేశ్వర స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు.  తిరమల శ్రీనివాసుని తరఫున టీటీడీ  పాలకమండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి దంపతులు శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం  వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా  సుబ్బా రెడ్డి  గణాధిపతికి పట్టు వస్త్రాలు అందజేశారు. తొలుత కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న  వై.వి. సుబ్బారెడ్డి  దంపతులు చేరుకున్నారు. అక్కడ వారికి డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, శాసన సభ్యులు ఎం ఎస్ బాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానంద రెడ్డి, కాణిపాకం ఆలయ ఈవో   వెంకటేసు స్వాగతం పలికారు.
        తదుపరి ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తో పాటు డిప్యూటి సిఎం, ఎమ్మెల్యే, ఆర్టీసీ రీజనల్ చైర్మన్లకు సాంప్రదాయ బద్దంగా పరివట్టం కట్టి తలమీద పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం విఘ్ననాయకుని  దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు అతిథులకు వేద ఆశీర్వచనం చేశారు. కాణిపాకం కార్యనిర్వహణాధికారి వెంకటేసు టీటీడీ చైర్మన్ దంపతులతో పాటు మిగిలిన అతిథులకు   స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

బంగారు రథాన్ని పరిశీలించిన చైర్మన్
         కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని  వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.వినాయక స్వామికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టీటీడీ కి రూ 6 కోట్లు చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో టీటీడీ నిధులు సమకూర్చిందని అన్నారు. కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యం అయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని పార్వతీ పుత్రుడ్ని  ప్రార్థించినట్లు  చెప్పారు.ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని  సుబ్బారెడ్డి తెలిపారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి  ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు. టీటీడీ ఈఈ  శివరామ కృష్ణ, ఎఈవో మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి,  కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: