హిట్మ్యాన్ సూపర్ హిట్తో సిరీస్ కైవసం చేసుకున్న టీమీండియా.. అన్ని మ్యాచ్లు గెలిచి బ్లాక్ క్యాప్స్కు వైట్ వాష్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు.. చివరి రెండు మ్యాచుల్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది కివీస్ జట్టు. వెల్లింగ్టన్లో వాతావరణం నేటి మ్యాచ్కు అనుకూలిస్తుందా..? ప్రతికూలిస్తుందా..? వెస్ట్ ప్యాక్ పిచ్ ఎవరికి సహకరించనుంది..?
న్యూజిలాండ్తో ఐదు టీ-20ల సిరీస్లో నాలుగో మ్యాచ్ ఇవాళ వెస్ట్ ప్యాక్ స్టేడియంలో జరుగనుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో నెగ్గి సిరీస్ను కైవసం చేసుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఈ మ్యాచ్ లో పలు ప్రయోగాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. నాలుగో టీ-20లో టీం ఇండియా జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగుతుందని ఇప్పటికే ప్రకటించాడు విరాట్ కోహ్లీ. సిరీస్లో ఎంపికైన అందరికీ అవకాశం రావాలని అంటున్నాడు టీమిండియా కెప్టెన్.
వెల్లింగ్టన్లో వాతావరణం క్రికెట్కి అనుకూలంగానే ఉండబోతుంది. అట్మాస్ఫియర్ ప్రశాంతంగా ఉంటుందని.. ఎటువంటి వర్షం కురిసే సూచనలు లేవని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. 18 నుంచి 20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతతో చల్లగా ఉండనుంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందని భావిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. పిచ్పై బౌలింగ్ చేయడాన్ని సీమర్లు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
మూడు టీ-20లు జరిగిన స్టేడియంల మాదిరిగానే వెస్ట్ ప్యాక్ స్టేడియంలో కూడా బౌండరీ లైన్ ఉంటుంది. దీంతో మరోసారి మైదానంలో పరుగుల వరదపారే అవకాశముంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసే జట్టు సులభంగా 200లకు పైగా స్కోర్ చేయవచ్చు. అయితే రెండో ఇన్నింగ్స్లో పిచ్ ఛేజింగ్కి అనుకూలిస్తుంది. దీంతో టాస్ గెలిచి.. తొలుత ఫీల్డింగ్ చేసిన జట్టుకే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.న్యూజిలాండ్ తో జరిగే ఈ మ్యాచ్ పై అంతా ఉత్కంఠ నెలకొంది. సగటు భారతీయుడు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. భారత్ ఎలాగైనా గెలవాలని పరితపిస్తున్నాడు.