టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని అందరిలాగా పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు.. ఇక అభిమానులతో కలిసేది కూడా చాలా తక్కువే. కేవలం క్రికెట్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోనికి ప్రస్తుతం టీం ఇండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న యాక్టివ్ క్రికెటర్లతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని క్రేజ్ కాస్తయినా తగ్గలేదు.



 అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. కాగా ఇక 2024 ఐపీఎల్ సీజన్ కి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ కి చెన్నై సూపర్ కింగ్స్ సారాధ్య బాధ్యతలను అప్పగించాడు ధోని. దీంతో ధోని కి ఇదే చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయ్. ఈ నేపథ్యంలో ధోని మరోసారి బ్యాటింగ్లో అదరగొడితే చూడాలని అభిమానులు అనుకున్నారు. కాగా అభిమానులు కోరుకున్నట్లుగానే ధోని ఇరగదీస్తున్నాడు. ఇక చాన్స్ వస్తే చాలు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉన్నాడు.  


 చెన్నై సూపర్ కింగ్స్ చిరకాల ప్రత్యర్థిగా పిలుచుకునే ముంబై ఇండియన్స్ తో ఇటీవల జరిగిన మ్యాచ్ లో ధోని బ్యాటింగ్లో వీర బాదుడు బాదేసాడు. కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. అయితే తాను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను కూడా సిక్సర్లుగా మలచడంతో స్టేడియం మొత్తం ధోని నామస్మరణంతో దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు మహేంద్రసింగ్ ధోని. ఐపీఎల్ ఇన్నింగ్స్ లో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇలా ధోని వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: