ఇటీవల చైనా-భారత సైనికుల మధ్య గాల్వన్ లోయలో తీవ్ర పోరాటం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత తీవ్రమైంది. చైనా వస్తు బహిష్కరణ ఓ ఉద్యమంలా రాజుకుంది. అయితే చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అనూహ్యమైన చర్య తీసుకుంది. సుమారు 59 చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక చైనాకు చెందిన ఆ 59 మొబైల్ యాప్స్లో షేర్ఇట్ కూడా ఒకటి.
కొన్నాళ్ల క్రితం వరకు ఒక మొబైల్ నుంచి మరో మొబైల్కు ఫొటోలు/ఫైల్స్ పంపించాలంటే బ్లూటూత్ ఒక్కటే దిక్కు. ఆ తర్వాత షేర్ఇట్ వచ్చి బ్లూటూత్ని పక్కకు నెట్టేసింది. ఈ క్రమంలోనే ఫుల్ క్రేజ్ సంపాధించుకుంది. అయితే ఇప్పుడు షేర్ఇట్ బ్యాన్ అవ్వడంతో.. ఈ యాప్ యూజర్స్ ఇప్పుడు లోకల్ యాప్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో షేర్ఇట్ యూజర్లకు గూగుల్ గుడ్న్యూస్ చెప్పింది. ఆ యాప్ కు ధీటుగా గూగుల్ నుంచి మరో యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులోకి వచ్చింది.
అదే నియర్బై షేర్(NearBy Share). ప్రస్తుతం గూగుల్ నియర్బై షేర్ యాప్ బీటా వర్షన్ను పరీక్షిస్తోంది. దీని ద్వారా పెద్ద ఫైళ్ళను కూడా కొన్ని సెకన్లలో పంచుకోవచ్చు. అంతేకాదు, నియర్బై షేర్ త్వరలో లాంచ్ చేయవచ్చని గూగుల్ స్వయంగా వెల్లడించింది. దీని ద్వారా షేర్ఇట్ తరహాలో ఒక మొబైల్ నుంచి మరో మొబైల్కు ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ పంపించుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ కొత్త ఫీచర్ను సృష్టించింది. దీని సహాయంతో ఆండ్రాయిడ్ యూజర్లు ఒక పరికరం నుంచి మరొక పరికరానికి డేటాను సులభంగా బదిలీ చేయవచ్చు. ఇక ఆండ్రాయిడ్లోని ఈ కొత్త ఫీచర్ OS ఆండ్రాయిడ్ 6 సపోర్ట్ తో వస్తుంది.