న్యూఢిల్లీ: టెక్నాలజీలో భారత్ అద్భుతంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అనేక దేశాల్లో తయారైన టెక్నాలజీపైనే ఆధారపడిన భారత్ ఇప్పుడు దేశీయంగానే కొత్త కొత్త అప్లికేషన్ లను అభివృద్ధి చేస్తోంది. వీటి ద్వారా అంతర్జాతీయ సంస్థలకే పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పాపులర్ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ కు పోటీగా ఓ దేశీ యాప్ ను అభివృద్ధి చేసింది. ఆ యాప్ కు 'కూ' అని పేరు పెట్టింది.

ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. తాను ‘కూ’ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో ఖాతా తెరిచినట్టు ప్రకటించారు. ఇది ఒక మేక్ ఇన్ ఇండియా యాప్ అని, దీనికి అధికారిక ట్విట్టర్‌తో పాటు మద్దతు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చాలా రోజుల క్రితమే 'కూ' యాప్‌లో అకౌంట్ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఐటీ, ఇండియా పోస్ట్‌తో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లో ఈ ప్లాట్‌ఫామ్ వినియోగ దశలో ఉందని చెబుతోంది.

కూ అనేది ట్విట్టర్ తరహాలోని అప్లికేషన్ అని, ఇది 10 నెలల క్రితమే రూపొందించబడిందని, ఇది ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచిందని కేంద్ర శాఖ వెల్లడించింది. ఈ యాప్ అపారమేయ రాధాకృష్ణ, మయంక్ బిదావడ్కాలు అభివృద్ధి చేశారని, ఈ యాప్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒడిశా, అస్సామీ తదితర భాషలలో అందుబాటులో ఉందని వెల్లడించింది.


గూగుల్ ప్లే స్టోర్‌లో దీని డౌన్‌లోడ్ పేజ్‌లో ఉన్న వివరాల ప్రకారం ’కూ‘ను భారతీయులు తమ మాతృభాషలో అభిప్రాయాలను వెల్లడించేందుకు, చర్చించేందుకు రూపొందించారు. కాగా గత కొంతకాలంగా ట్విట్టర్.. భారత ప్రభుత్వం మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్ నేపథ్యంలోనే ట్విట్టర్ ఇండియాకు  పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ పదవికి రాజీనామా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: