భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి జంతువులను బలి ఇవ్వడం అనాదిగా ఒక ఆచారంగా వస్తోంది. ఈ ఆచారాన్ని కొందరు ఆధ్యాత్మిక విశ్వాసాలతో పవిత్రమైనదిగా భావిస్తారు. మరికొందరు దీన్ని క్రూరత్వం, అమానుషంగా పరిగణిస్తారు. ఈ ఆచారాన్ని అనుసరించే వారి ప్రకారం, దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి జంతువులను బలి ఇస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయంగా భావించి దానిని కొనసాగిస్తుంటారు.

ఇలాంటివి నమ్మని వారు మాత్రం 21వ శతాబ్దంలో ఇలాంటి ఆచారాలు అమానుషమని, ఇవి నాగరికతకు విరుద్ధమని విమర్శలు చేస్తుంటారు. భారతదేశంలో జంతువులకు క్రూరత్వం చేయడాన్ని నిషేధించే చట్టాలు ఉన్నాయి. ఈ ఆచారం ఈ చట్టాలను ఉల్లంఘిస్తుందని వాదిస్తారు. ఈ ఆచారంపై సామాజికంగా చర్చ జరుగుతోంది. చాలామంది ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. జంతువుల బలికి బదులుగా ఇతర ఆచారాలు లేదా పూజలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనం కర్త చాగంటి కోటేశ్వరరావు జంతు బలి గురించి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మాట్లాడుతూ 'శ్రీ విద్య సంప్రదాయంలో అమ్మవారికి ఒక మేకపోతు, ఒక నల్లపిల్లి, ఒక దున్నపోతును బలి ఇవ్వమని చెప్పడం జరిగింది. దీని గురించి తెలియగానే చాలామంది ఈ జంతువులను చంపేస్తారు. కానీ శ్రీ విద్య సంప్రదాయం వాటిని చంపేయమని చెప్పడం లేదు. ఇక్కడ జంతువులు అంటే మనలోని అవలక్షణాలు. ఉదాహరణకు మేక అంటే అది మనలోని మూర్ఖత్వానికి ప్రతీక, నల్ల పిల్లి అంటే దొంగ బుద్ధి, దున్నపోతు అంటే పిరికితనం. ఈ మూడింటినీ బలిపీఠం వద్ద బలి ఇవ్వాలని చెబుతారే తప్ప జంతువులను బలి ఇవ్వమని చెప్పరు." అని చాగంటి కోటేశ్వరరావు జంతువుల బలికి కొత్త అర్థం చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మరి ప్రజలు ఆయన మాటలతో ఏకీభవిస్తారా, జంతువుల బలులను ఆపుతారా, కేవలం తమలోని దుర్గుణములను మాత్రమే చంపేయాలని అర్థం చేసుకుంటారా?






 


మరింత సమాచారం తెలుసుకోండి: