
వార్నీ..ఉరితీసే ముందు ఖైదీ చివరి కోరిక అడిగేది అందుకా..? ఈ రూల్ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కారణం ఇదే..!

మరణశిక్ష అమలు సమయంలో ఖైదీ చివరి కోరికను అడగడం అనే ఆచారం ఇంగ్లాండ్లో 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. మానవత్వం, మత విశ్వాసాల ప్రభావంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాంప్రదాయంగా మారింది. భారతదేశంలో కూడా ఇది చాలాచోట్ల అమల్లో ఉంది. మరణశిక్ష లేదా ఉరిశిక్ష అనేది మానవ చరిత్రలో అత్యంత తీవ్రమైన శిక్షలలో ఒకటిగా చెప్పబడుతుంది. వేల సంవత్సరాలుగా వివిధ నాగరికతలు నేరాలను అరికట్టడానికి, సమాజంలో భయం కలిగించడానికి ఈ శిక్షను అమలు చేస్తూ వచ్చాయి. అధికారులు ఉరిశిక్ష అమలు చేసే ముందు ఖైదీ చివరి కోరికను అడగడం కూడా ఆ సాంప్రదాయంలో భాగం.
నిజానికి ఇది ఏ రూల్ కాదు. ఏ రాజ్యాంగంలోనూ రాసి ఉండదు. సినిమాలు, సీరియల్స్ లేదా వార్తల్లో చూసి తెలిసిన విషయమే. కానీ ఎందుకు ఖైదీ చివరి కోరికను అడుగుతారు? . చరిత్రకారుల ప్రకారం.. ఖైదీ చివరి కోరికను నెరవేర్చడం అనేది ఒక పురాతన ఆచారం. దీనికి ఖచ్చితమైన ఆధారాలు లభించకపోయినా, 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఈ ఆచారం మరింత పద్ధతిగా ప్రారంభమైందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆ కాలంలో ఉరిశిక్ష విధించే ముందు ఖైదీకి అతని చివరి కోరికను చెప్పే అవకాశం ఇచ్చేవారట. ఒకవేళ ఆ కోరిక తీరకపోతే, అతను దెయ్యంగా మారుతాడని అప్పట్లో జనాలు నమ్మేవారు. సమాజంలో అనేకమంది ప్రజలు “ఒకరి చివరి కోరిక నెరవేరకపోతే అతని ఆత్మ సంచరిస్తూ ఉంటుంది” అనే నమ్మకం కలిగి ఉండేవారు. అందువల్ల మతపరమైన విశ్వాసం, మానవత్వం కలిసిపోవడం వల్ల ఈ ఆచారం ఒక సాంప్రదాయంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జైలు మాన్యువల్లో దీన్ని తప్పనిసరి నియమంగా ఎక్కడా నమోదు చేయలేదు.
భారతదేశంలో కూడా ఇది చాలాచోట్ల అమల్లో ఉంది. అయితే ఖైదీ చేసిన ప్రతి కోరికను నెరవేర్చడం సాధ్యం కాదు. ఒకవేళ ఖైదీ “నా ఉరిశిక్ష రద్దు చేయండి” లేదా “వాయిదా వేయండి” అని కోరితే, అది అంగీకరించబడదు. అప్పటికప్పుడే జరిగే విషయాలను మాత్రమే కోరికలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు: ఏదైనా తినాలని అనుకుంటున్నారా, తన మతగురువును కలవాలనుకుంటున్నారా, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, కుటుంబ సభ్యులను చివరిసారి చూడాలనుకుంటున్నారా — ఇలాంటివి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతకుమించి ఏ కోరిక కోరినా అది లెక్కలోకి రాదు. తక్షణమే ఉరిశిక్ష అమలు చేస్తారు.