ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటుంటారు. అయితే నేటి సమాజంలో చాల మంది పిల్లల సమస్యతో బాధపడుతున్నారు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం.. బిడ్డల్లేకపోయిన తరువాత.. అని బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. కాని అప్పటికే ఆలస్యం అయిపోతోంది. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. కెరీర్ కోసం పరుగులు పెడుతున్న నేటి యువతరంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య సంతాన లేమి.

ఇక ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడుతున్నారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. సాయంత్రం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు సరదాగా బయటకు వెళ్లి ఏదో ఒకటి రుచిగా తినాలనుకుంటారు, కాని ఇప్పుడు అలా బయటకు వెళ్లి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు న్యూట్రిషనిస్టులు.

అయితే జంక్ ఫుడ్ అతిగా తినేవారిపై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు మహిళలపై జంక్ ఫుడ్ ప్రభావాలపై అధ్యయనం జరిపారు. మహిళలు ఫాస్ట్‌ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే భవిష్యత్తులో సంతాన సమస్యలు తప్పవని పేర్కొంది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 5 వేల మందికి పైగా మహిళలపై పరిశోధన నిర్వహించారు.

అంతేకాదు.. పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ లాంటివి సంతాన సామర్థ్యం తగ్గిస్తాయని అధ్యయనం వెల్లడించింది. మద్యపానం, ధూమపానం, వయసు, శరీరతత్వం వంటివి కూడా సంతాన సామర్థ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం చేశారు. ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తింటూ, పండ్లు ఎక్కువగా తినే మహిళల్లో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్కువ సమయంలోనే గర్భం దాల్చుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: